మూడో వంతు కేసులు ఈ జిల్లాల్లోనే

దేశంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా నిజాముద్దీన్‌ మర్కజ్‌ ఘటన అనంతరం దీని తీవ్రత పెరిగింది. 9 రాష్ట్రాల్లోని 12 జిల్లాల్లో ఈ సంఖ్య ఎక్కువగా....

Published : 06 Apr 2020 20:25 IST

దిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా నిజాముద్దీన్‌ మర్కజ్‌ ఘటన అనంతరం దీని తీవ్రత పెరిగింది. 9 రాష్ట్రాల్లోని 12 జిల్లాల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా 284 జిల్లాలు ఈ మహమ్మారి బారిన పడ్డాయి. ఇప్పటి వరకు దేశం మొత్తమ్మీద నమోదైన కేసుల్లో మూడో వంతు కేసులు ఈ జిల్లాల్లో నమోదు కావడం గమనార్హం.

దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4281 (సాయంత్రం 6 గంటల వరకు వైద్యారోగ్య శాఖ డేటా ప్రకారం) నమోదు కాగా.. అందులో దాదాపు 1300కు పైగా కేసులు ఈ 12 జిల్లాల్లోనే నమోదయ్యాయి. ఈ జాబితాలో దక్షిణ దిల్లీ అగ్రస్థానంలో ఉంది. ముంబయి రెండోస్థానంలో ఉంది. హైదరాబాద్‌ నాలుగో స్థానంలో ఉండడం గమనార్హం. 100కు పైగా కేసులున్న జిల్లాల్లో కేరళలోని కసోర్‌గోడ్‌, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ ఉన్నాయి. చెన్నై (తమిళనాడు), పుణె (మహారాష్ట్ర), గౌతమ్‌ బుద్ధనగర్ (యూపీ)‌, జైపూర్ (రాజస్థాన్‌)‌, అహ్మదాబాద్ (గుజరాత్‌)‌, యాదాద్రి (తెలంగాణ), కన్నూర్‌ (కేరళ) జిల్లాలు 50కి పైగా కేసులున్న జాబితాలో ఉన్నాయి. కేసుల తీవ్రత ఆధారంగా ఈ విధంగా జిల్లాలను విభజించి అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని వైద్యారోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ ఏప్రిల్‌ 14 తర్వాత లాక్‌డౌన్‌ను ఎత్తివేసినప్పటికీ ఏయే జిల్లాల్లో లాక్‌డౌన్‌ పొడిగించాల్సిన అవసరం ఏర్పడుతుందో తెలుసుకునేందుకు వీలుపడుతుందని తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని