కష్టకాలంలో పెద్దమనసు చాటుకున్న భారత్‌!

కొవిడ్‌-19 చికిత్స కోసం ప్రపంచ దేశాల నుంచి హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఔషధానికి డిమాండ్‌ పెరుగుతోంది. దీని ఎగుమతులపై భారత్‌ విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఒత్తిడి ఎక్కువవుతోంది........

Updated : 07 Apr 2020 11:28 IST

దిల్లీ: కొవిడ్‌-19 చికిత్స కోసం ప్రపంచ దేశాల నుంచి హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఔషధానికి డిమాండ్‌ పెరుగుతోంది. దీని ఎగుమతులపై భారత్‌ విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఒత్తిడి ఎక్కువవుతోంది. కరోనా ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో భారత్‌ పెద్దమనసుతో వ్యవహరించింది. మానవతా దృక్పథంతో క్లోరోక్విన్‌ సహా అవసరమైన ఇతర ఔషధాల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేస్తున్నట్లు విదేశాంగశాఖ ప్రకటించింది. ఆయా దేశాలకు అససరమైన మేర కొన్ని రకాల మందుల్ని సరఫరా చేసేందుకు అంగీకరించింది. అలాగే పొరుగుదేశాలకు పారాసిటమాల్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌ అవసరమైన మొత్తానికి లైసెన్స్‌ అనుమతులు కూడా ఇస్తున్నట్లు తెలిపింది. ఈ అంశాన్ని రాజకీయం చేస్తూ భారత్‌పై ఆరోపణలు చేసే ప్రయత్నాల్ని ఇంతటితో ఆపాలని స్పష్టం చేసింది. 

ప్రస్తుతానికి కొవిడ్‌-19 చికిత్సకు ఎలాంటి టీకాగానీ, ఔషధంగానీ లేవు. అయితే మలేరియాను నయం చేయడానికి వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఆశాజనక ఫలితాలు ఇస్తోందని పరిశోధకులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వీటిని రోగులకు దగ్గరగా ఉండే వ్యక్తులు వాడొచ్చని అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ), భారత వైద్య పరిశోధన మండలి సూచించింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఈ మందుకు డిమాండ్‌ పెరిగింది.

అయితే భారత అవసరాలకు సరిపడిన తర్వాత అదనంగా మరో 25 శాతం నిల్వలను ఉంచుకొని.. మిగిలిన హైడ్రాక్సీక్లోరోక్విన్‌ని ఇతర దేశాలకు సరఫరా చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఆయా దేశాల అవసరాల్ని నిశితంగా పరిశీలించి ఎంతమేర సరఫరా చేయాలో నిశ్చయించనున్నట్లు తెలుస్తోంది. నేడు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో మంత్రుల బృందం సమావేశమై దీనిపై అధికారిక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేయకుండా.. కేవలం కొన్ని మినహాయింపులు మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది.

 

ఇవీ చదవండి...

అలా చేస్తే భారత్‌పై ప్రతీకారం ఉండొచ్చు: ట్రంప్‌

గబ్బిలంతో కీడెంత?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని