కొత్త సవాల్‌: రెండోసారి కరోనా దాడి?

ఒక్కసారి కరోనా నుంచి కోలుకున్న వ్యక్తికి మళ్లీ వైరస్‌ సోకుతుందా? అప్పటికే శరీరంలో వృద్ధిచెందిన యాంటీబాడీలు ఆ ప్రభావాన్ని తగ్గిస్తాయా? వైరస్‌ను నిద్రాణ స్థితిలోనే ఉంచుతాయా? ఇతరులకు సోకినా ప్రమాదం ఉండదా? ప్రస్తుతం వైద్యులు, పరిశోధకులకు ఇలాంటి సందేహాలెన్నో ఉన్నాయి.....

Published : 12 Apr 2020 00:39 IST

ఎందుకిలా జరుగుతుందో అర్థంకావడం లేదన్న దక్షిణ కొరియా

సంక్రమణ, ప్రమాదకరం కాకపోవచ్చని అంచనా!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒక్కసారి కరోనా నుంచి కోలుకున్న వ్యక్తికి మళ్లీ వైరస్‌ సోకుతుందా? అప్పటికే శరీరంలో వృద్ధిచెందిన యాంటీబాడీలు ఆ ప్రభావాన్ని తగ్గిస్తాయా? వైరస్‌ను నిద్రాణ స్థితిలోనే ఉంచుతాయా? ఇతరులకు సోకినా ప్రమాదం ఉండదా? ప్రస్తుతం వైద్యులు, పరిశోధకులకు ఇలాంటి సందేహాలెన్నో ఉన్నాయి. అయితే దక్షిణ కొరియాలో కొవిడ్‌-19 నయమైందని భావించిన 91 మందికి పరీక్షల్లో మళ్లీ పాజిటివ్‌ రావడం కలకలం సృష్టిస్తోంది.

కరోనా నయమైన వారికి వైరస్‌ ఇతరుల నుంచి సోకుండా శరీరంలోనే తిరిగి చైతన్యమైందేమోనని భావిస్తున్నామని కొరియా వ్యాధుల నియంత్రణ (కేసీడీసీ) సంస్థ డైరెక్టర్‌ జియాంగ్‌ ఇయున్‌ క్యెయాంగ్‌ అంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతోందో అర్థంకావడం లేదన్నారు. వైద్యులు, శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారని వివరించారు. ఒక్కసారి కొవిడ్‌ సోకినవారిలో యాంటీబాడీలు పెరిగి సంబంధిత రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఇంతకాలం భావించారు. వైరస్‌ మళ్లీ దాడిచేస్తుండటంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది.

దక్షిణ కొరియాలో రెండోసారి కొవిడ్‌ సోకిన వారి సంఖ్య సోమవారం 51గా ఉండగా ఇప్పుడు 91కి చేరుకుంది. ఆ దేశంలో దాదాపుగా 7000 మంది కరోనా నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. ‘రెండో సారి సోకినవారి సంఖ్య పెరుగుతోంది. 91 అనేది ఇప్పుడే మొదలైందనడానికి నిదర్శనం’ అని కొరియన్‌ యూనివర్సిటీ గురో ఆస్పత్రిలో అంటువ్యాధుల ప్రొఫెసర్‌ కిమ్‌ వూ జూ అన్నారు. బహుశా వైరస్‌ తిరిగి చైతన్యమైందేమోనని భావిస్తున్నానని తెలిపారు.

నమూనాల పరీక్షల్లో కొందరి ఫలితాలు తప్పుగా వచ్చాయేమోనన్న అనుమానాలూ ఉన్నాయి. కోలుకున్నవారిలోనూ వైరస్‌ అవశేషాలు ఉంటాయని పాజిటివ్‌ వచ్చినప్పటికీ ఇతరులకు సంక్రమించకపోవచ్చని మరికొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. అంత ప్రమాదకరం కాకపోవచ్చని అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ అన్ని విషయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని