కరోనా నిర్థారణ పరీక్షలు ఎలా చేస్తారంటే..!

ప్రపంచం మొత్తం కరోనాపై పోరు సాగిస్తున్న వేళ వైద్య పరిభాష తెలియని సామాన్యుడి మదిలో ఎన్నో ప్రశ్నలు. రాపిడ్ యాంటీబాడీస్‌ టెస్ట్, ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్ట్‌,  వంటి పదాలు తెలియని ఎంతో మందికి వాటి గురించిన పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేశారు.... 

Published : 14 Apr 2020 20:30 IST

దిల్లీ: ప్రపంచం మొత్తం కరోనాపై పోరు సాగిస్తున్న వేళ వైద్య పరిభాష తెలియని సామాన్యుడి మదిలో ఎన్నో ప్రశ్నలు. రాపిడ్ యాంటీ బాడీస్‌ టెస్ట్, ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్ట్‌, వంటి పదాలు తెలియని ఎంతో మందికి వాటి గురించి పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేశారు వైద్యులు. మరి అవేంటో మనం తెలుసుకుందామా. ప్రస్తుతం భారత్‌లో కరోనా నిర్థారణకు ఆర్‌టీ-పీసీఆర్ టెస్ట్, రాపిడ్ యాంటీబాడీస్‌ టెస్ట్‌ అనే రెండు పద్ధతులను అవలంబిస్తున్నారు. 

ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్ట్

రివర్స్ ట్రాన్‌స్క్రిప్షన్‌ పాలిమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌ (ఆర్‌టీ-పీసీఆర్‌) అనేది ల్యాబ్‌లో ఆర్‌ఎన్‌ఏను డీఎన్‌ఏగా మార్చే ప్రక్రియ. యాంటీబాడీ టెస్టుల్లో భాగంగా వైరస్‌ను కనుగొని దానికి శరీరం ఏవిధంగా స్పందిస్తుంది అనేది ఈ పరీక్షల్లో నిర్థారిస్తారు. ఇందు కోసం రోగి శరీరంలోని శ్వాస మార్గం, గొంతు, ముక్కు నుంచి నమూనాలకు సేకరిస్తారు. వీటి ఫలితాల కోసం 12 నుంచి 24 గంటల సమయం పడుతుంది. ఇది ఎంతో ఖరీదైంది. 

రాపిడ్ యాంటీబాడీస్‌ టెస్ట్

ఈ పరీక్షల్లో ఖర్చు తక్కువ, ఫలితం కూడా కేవలం 20 నుంచి 30 నిమిషాల్లో తెలుస్తుంది. వీటిలో వైరస్‌పై ప్రతి స్పందించేదుకు వ్యక్తి శరీరంలో యాంటీబాడీలు తయారయ్యా? లేదా అనేది ఈ పరీక్షల్లో తెలుస్తుంది. ఒక వేళ యాంటీబాడీలు ఉత్పత్తి అయితే పాజిటివ్‌, కాకపోతే నెగటివ్ అని ఫలితాలను నిర్థారిస్తారు. ఈ పరీక్షలు ఎక్కువగా కరోనా అనుమానితులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అంటే కరోనా ప్రజ్వలన కేంద్రాలుగా గుర్తింపబడిన ప్రాంతాల్లో నిర్వహిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో కరోనా సోకినప్పటికీ యాంటీబాడీలు ఉత్పత్తవ్వని కారణంగా పరీక్షల సమయంలో నెగటివ్‌ వచ్చి మరి కొద్ది రోజుల తర్వాత సదరు వ్యక్తికి ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల్లో పాజిటివ్ రావడం జరిగిందని వైద్యులు తెలిపారు. ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించిన వారిలో వైరస్ వ్యాప్తి ఈ విధంగా జరిగిందని అన్నారు. 

ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు ప్రభుత్వ ల్యాబ్స్‌లో ఉచితం అయినప్పటికీ, ప్రైవేటు ల్యాబ్‌లు వీటి కోసం రూ.4500 వసూలు చేస్తున్నాయి. సోమవారం సుప్రీం కోర్టు ప్రైవేట్ ల్యాబ్‌లు కూడా ఆయుష్మాన్‌ భారత్‌ లబ్ధిదారులకు కరోనా నిర్థారణ పరీక్షలు ఉచితంగా చేయాలని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులు చేసింది. అయితే ఈ పరీక్షలు ఎంత మేర ప్రభావంతంగా పనిచేస్తాయనేది రోగి వైరస్‌ బారిన పడిన సమయం నుంచి అతడిలో వైరస్‌ తీవ్రత, ఆ వ్యక్తి నుంచి సేకరించిన నమూనాల నాణ్యత, వాటిని ఏ విధంగా ప్రాసెస్‌ చేశారు, పరీక్షలకు ఉపయోగించే కిట్లలోని కచ్చితత్వం వంటి పలు అంశాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని