కేంద్రం అపార్థం చేసుకుంది: కేరళ

లాక్‌డౌన్‌ మినహాయింపుల విషయంలో కేరళ ప్రభుత్వ అనుమతులు కేంద్రం మార్గదర్శకాల్ని నీరుగార్చేలా ఉన్నయనడాన్ని ఆ రాష్ట్రం ఖండించింది.......

Updated : 20 Apr 2020 15:08 IST

తిరువనంతపురం: లాక్‌డౌన్‌ మినహాయింపుల విషయంలో కేరళ ప్రభుత్వ అనుమతులు కేంద్రం మార్గదర్శకాల్ని నీరుగార్చేలా ఉన్నయనడాన్ని ఆ రాష్ట్రం ఖండించింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు కేంద్ర మార్గదర్శకాలకు లోబడే ఉన్నాయని పేర్కొంది. ఈ విషయంలో కేంద్రం.. రాష్ట్రాన్ని అపార్థం చేసుకుందని అభిప్రాయపడింది. ఆ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ మాట్లాడుతూ..‘‘ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే రాష్ట్రంలో మినహాయింపులిచ్చాం. ఈ విషయంలో కేంద్రం రాష్ట్రాన్ని అపార్థం చేసుకుంది. కరోనా మహమ్మారిపై పోరు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. దీనినై కేంద్రానికి ఒకసారి వివరణ ఇస్తే అన్నీ సద్దుమణుగుతాయి’’ అని అన్నారు.

అంతకు ముందు కేరళ ప్రభుత్వం స్థానిక దుకాణ సముదాయాలు, క్షవరశాలలు, రెస్టారెంట్లు, పుస్తకశాలలు, మున్సిపల్‌ పరిధిలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను తెరవడానికి అనుమతిచ్చింది. అలాగే పట్టణ ప్రాంతాల్లో బస్సులు తిరిగేందుకు, కార్లలో వెనుకభాగంలో ఇద్దరు ప్రయాణించేందుకు వెసులుబాటు కల్పించింది. దీనిపై కేంద్ర హోంశాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రాలు ఇష్టారీతిన మార్గదర్శకాలు జారీచేసుకోవద్దని సూచించింది. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కొవిడ్‌-19 విజృంభణ భారీ స్థాయిలో ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు కేరళ సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి అజయ్‌ భల్లా లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తాజాగా కేరళ ప్రభుత్వం అదనపు మినహాయింపుల విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వైరస్‌ తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాలతో పాటు కొన్ని రంగాలకు కేంద్ర ప్రభుత్వ మినహాయింపులిచ్చిన విషయం తెలిసిందే. అవి నేటి నుంచి అమలులోకి వచ్చాయి. ఇవీ చదవండి..

ఇష్టానుసారం అనుమతులివ్వడం సరికాదు

దేశంలో కొవిడ్‌ నియంత్రణలోనే ఉంది: కిషన్‌ రెడ్డి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని