
యూఎస్లో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం!
హ్యూస్టన్: అమెరికాలో హ్యూస్టన్ విశ్వవిద్యాలయం ఛాన్స్లర్గా ఉన్న భారత సంతతికి చెందిన రేణు ఖాటోర్(61)కు అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెన్స్(ఏఏఏఎస్)కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. విద్యారంగానికి అందించిన సేవలకుగానూ ఆమెకు ఈ గౌరవం లభించింది. 2020కి సంబంధించి ఏఏఏఎస్కు ఎంపికైన వారిలో రేణు ఒకరు. వీరిలో వివిధ రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు, స్కాలర్లు, ఆర్టిస్టులు, నాయకులు ఉన్నారు.
రేణు ఉత్తర్ప్రదేశ్లో జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ సిస్టమ్ ఛాన్స్లర్గా, వర్సిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ యూనివర్సిటీ ఛాన్స్లర్గా ఎన్నికైన మొట్టమొదటి మహిళ రేణూయే. అలాగే అమెరికాలో కీలక పరిశోధనలకు వేదికగా ఉన్న ఓ ప్రఖ్యాత వర్సిటీకి ఛాన్స్లర్గా ఎన్నికైన తొలి భారత సంతతి మహిళ కూడా ఈమే కావడం విశేషం. ప్రపంచంలోనే అత్యంత ప్రముఖుల సరసన తనను చేర్చడం పట్ల రేణు ఖాటోర్ సంతోషం వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులను ఏఏఏఎస్కు ఎంపిక చేస్తుంటారు. అలా ఇప్పటి వరకు 250 మంది నోబెల్ బహుమతి గ్రహీతలు, పులిట్జర్ ప్రైజ్ విన్నర్లు ఈ బృందంలో చేరారు. వివిధ రంగాల్లో ప్రఖ్యాతి గాంచిన వ్యక్తులు వారి సేవల్ని ప్రజలకు చేరువచేసేలా ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈ అకాడమీని 1780లో ప్రారంభించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.