కరోనా పోరు: భారత్‌కు అమెరికా భారీ సాయం

కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్‌కు అమెరికా మరోసారి పెద్దమొత్తంలో సహాయాన్ని ప్రకటించింది.

Published : 30 Apr 2020 13:33 IST

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్‌కు అమెరికా మరోసారి పెద్దమొత్తంలో సహాయాన్ని ప్రకటించింది. అమెరికా ప్రభుత్వ సంస్థ యూఎస్‌‌ ఎయిడ్‌ ద్వారా ఇప్పటికే 2.9 మిలియన్ డాలర్ల సాయం చేసిన అగ్రరాజ్యం... అదనంగా మరో మూడు మిలియన్‌ డాలర్లు విడుదల చేస్తున్నట్లు నేడు వెల్లడించింది. ఈ మేరకు భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్‌ జస్టర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. కొవిడ్‌-19 వ్యాప్తి నివారణలోనూ, ఆ వ్యాధి బారిన పడిన వారికి తగిన వైద్యాన్ని అందించేందుకు ఈ నిధి ఉపయోగపడుతుందని అగ్రరాజ్యం పేర్కొంది.

పార్ట్నర్‌షిప్స్‌ ఫర్‌ ఎఫర్డబుల్‌ హెల్త్‌కేర్‌ యాక్సెస్‌ (పహల్‌) అనే ప్రాజెక్టు ద్వారా యూఎస్‌ఎయిడ్‌ ప్రైవేటు రంగం నుంచి వనరులు సమీకరించి నిధులు సమకూర్చుతోందని, ఈ నిధుల ద్వారా ద్వారా ప్రధాన మంత్రి జనారోగ్య యోజనలో నమోదు చేసుకున్న 20 వేల మంది పేదలకు కూడా ఆరోగ్యసహకారం అందించవచ్చని జస్టర్‌ పేర్కొన్నారు. 2009 నుంచి అమెరికా ప్రభుత్వం... సుమారు 70 బిలియన్‌ డాలర్ల వరకు మానవతా దృక్పథంతో సాయం అందించిందని కెన్నెత్ అన్నారు. అంటువ్యాధులను ఎదుర్కోవడానికి అమెరికా ప్రభుత్వం ముందుంటుందని, అదే రీతిలో కోవిడ్‌-19ను ఎదుర్కోవడానికి కూడా యూఎస్‌ఎయిడ్ ద్వారా చేయూతనిస్తున్నట్లు అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. ప్రజారోగ్య సంరక్షణ, ఆయుఃప్రమాణాన్ని పెంచటం కోసం భారత ప్రభుత్వం, యూఎస్‌ఎయిడ్ సంయుక్తంగా పహల్‌ కార్యక్రమం ద్వారా కృషిచేస్తున్నాయని... ఇరు దేశాల మధ్య నెలకొన్న బలమైన సంబంధాలకు ఇదొక ఉదాహరణ అని అమెరికా రాయబారి జస్టర్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని