సూరత్‌లో వలస కార్మికుల ఆందోళన

గుజరాత్‌లోని సూరత్‌లో పోలీసులు, వలస కార్మికుల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో పోలీసులు టియర్‌గ్యాస్‌ ప్రయోగించారు. తమను స్వస్థలాలకు పంపాలని కోరుతూ వందల సంఖ్యలో కార్మికులు సూరత్‌లోని వరేలి మార్కెట్ ప్రాంతంలో...

Published : 04 May 2020 18:14 IST

కార్మికులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగించిన పోలీసులు

సూరత్: గుజరాత్‌లోని సూరత్‌లో పోలీసులు, వలస కార్మికుల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో పోలీసులు టియర్‌గ్యాస్‌ ప్రయోగించారు. తమను స్వస్థలాలకు పంపాలని కోరుతూ వందల సంఖ్యలో కార్మికులు సూరత్‌లోని వరేలి మార్కెట్ ప్రాంతంలో ఆందోళనకు దిగారు. వారికి సర్దిచెప్పేందుకు అక్కడికి చేరుకున్న పోలీసులపై కూలీలు ఒక్కసారిగా రాళ్లతో దాడి చేశారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆందోళనకారులపైకి టియర్‌గ్యాస్‌ ప్రయోగించారు. టెక్స్‌టైల్‌, డైమండ్ పరిశ్రమల్లో పనిచేసేందుకు వేలాది మంది ఇతర రాష్ట్రాల నుంచి సూరత్‌కు వలస వస్తుంటారు. అయితే లాక్‌డౌన్‌తో పరిశ్రమలు మూతపడటంతో పనులు లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తమను స్వస్థలాలకు పంపాలని కార్మికులు ఆందోళనకు దిగారు. ఇప్పటి వరకు సూరత్‌లో కార్మికులు తమ సొంత గ్రామాలకు పంపాలని నాలుగు సార్లు ఆందోళన చేపట్టారు. 

లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికీ తమతో పనిచేయిస్తున్నారని కొంతమంది వలస కార్మికులు గత వారం పలు సంస్థల కార్యాలయాల ముందు ఆందోళనకు దిగారు. తాము స్వస్థలాలకు వెళ్లేందుకు అధికారులు సహాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే మార్చి నెలలో ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌన్‌తో వ్యాపార కార్యకలాపాలు ఆగపోయినప్పటికీ  సూరత్‌లోని డైమండ్, టెక్స్‌టైల్ అసోసియేషన్ మాత్రం పరిశ్రమలు పనిచేయాలని నిర్ణయించాయి. రెండు పరిశ్రమల్లో కలిపి దాదాపు 20 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. గుజరాత్‌లో ఇప్పటి వరకు 5,428 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 1,042 మంది కోలుకోగా, 290 మంది మరణించారు. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని