స్వదేశానికి భారతీయులు.. కేంద్రం చర్యలు

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. విదేశాల్లో సుమారు 1.04 కోట్ల మంది భారతీయులు ఉన్నట్లు కేంద్రం అంచనా వేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం అందరినీ భారత్‌కు తీసుకువస్తుందా అనే..

Published : 05 May 2020 21:32 IST

దిల్లీ: విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. విదేశాల్లో సుమారు 1.04 కోట్ల మంది భారతీయులు ఉన్నట్లు కేంద్రం అంచనా వేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం అందరినీ భారత్‌కు తీసుకువస్తుందా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. భారత్‌కు తిరిగి రావడానికి దాదాపు 3 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని.. ప్రయాణానికి చట్టబద్ధమైన కారణాలున్న భారతీయులను మాత్రమే తిరిగి స్వదేశానికి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించినట్లు విదేశాంగ శాఖ వర్గాల సమాచారం.

ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర హోంశాఖ పలు మార్గదర్శకాలు జారీ చేసింది. విదేశాల నుంచి భారత్‌కు రావాలనుకునే వారు వారి ప్రయాణ ఖర్చులు వారే భరించాలని హోంశాఖ సూచించింది. ప్రతిఒక్కరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయనున్నట్లు తెలిపింది. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.

నౌకాదళం ఆధ్వర్యంలో ‘ఆపరేషన్‌ సముద్ర’

మాల్దీవుల్లో ఉన్న భారతీయులను తరలించేందుకు భారత నావికా నౌకాదళం ‘ఆపరేషన్‌ సముద్ర’ను ప్రారంభించింది.  ఈ క్రమంలో నావికా దళానికి చెందిన 'జలశ్వ', 'మగర్' యుద్ధనౌకలు మాల్దీవులకు బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు యుద్ధనౌకల్లో సుమారు 1000 మందిని తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. భారతదేశానికి తిరిగి వచ్చే భారతీయుల జాబితాను మాల్దీవుల్లో ఉన్న ఇండియన్ మిషన్ ఇప్పటికే సిద్ధం చేసింది. ఈ నౌకల ద్వారా తరలించే వారికి వైద్య పరీక్షలు, స్క్రీనింగ్ కూడా నిర్వహించనున్నట్లు అధికారులు వివరించారు. భారత ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా సామాజిక దూరం పాటిస్తూ వైద్య సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. మాల్దీవుల నుంచి భారతీయులను కేరళలోని కొచ్చికి తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని