భారత్‌లో కరోనా: 1783 మరణాలు

భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కేవలం గత మూడురోజుల్లోనే దాదాపు 10వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Updated : 07 May 2020 13:13 IST

దిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కేవలం గత మూడురోజుల్లోనే దాదాపు 10వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,561 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా 89మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య గురువారం నాటికి 52,952కు చేరగా 1,783 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో 15,267మంది కోలుకుని డిశ్ఛార్జి కాగా మరో 35,902 మంది చికిత్స పొందుతున్నారు. రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

మహారాష్ట్రలో 16వేల కేసులు, 651 మరణాలు..

మహారాష్ట్రలో కొవిడ్‌-19 విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 1,233 కొత్త కేసులు, 34మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 16,758కి చేరగా 651 మంది మృత్యువాతపడ్డారు. ముంబయి మహానగరంలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముంబయిలో ఇప్పటికే పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,714కు చేరింది.

తమిళనాడులో ఒక్కరోజే 771కేసులు..

తమిళనాడులో గత మూడురోజులుగా వైరస్‌ విజృంభణ అనూహ్యంగా పెరిగింది. కేవలం నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 771కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4829కి చేరగా 35మంది ప్రాణాలు కోల్పోయారు. చైన్నైలో కరోనా తీవ్రతకు తాజాగా నగరంలోని కోయంబేడు మార్కెట్ కేంద్ర బిందువైంది. గుజరాత్‌లో నిన్న కొత్తగా 380కేసులు నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6625కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 396మంది మృత్యువాతపడ్డారు. దేశ రాజధాని దిల్లోలో బుధవారం ఒక్కరోజే 428 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో దీల్లీలో ఈ వైరస్‌ బారినపడినవారి సంఖ్య 5532కి చేరగా 65మంది మరణించారు. మధ్యప్రదేశ్‌లోనూ కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 3138 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా ఇప్పటివరకు 185మంది మరణించారు.

ఆంధ్రప్రదేశ్‌లో 1777, తెలంగాణలో 1107..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో నిన్న ఒక్కరోజే 60పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 1777కి చేరింది. వీరిలో 36మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారినపడి 729మంది కోలుకున్నారు. ఇక తెలంగాణలో నిన్న కొత్తగా 11 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1107కి చేరగా 29మంది చనిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని