శ్వేతసౌధంలో మరో కరోనా కేసు!

అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ సిబ్బంది ఒకరికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు ప్రకటించారు.

Published : 09 May 2020 12:41 IST

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ సిబ్బందిలో ఒకరికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు ప్రకటించారు. ఉపాధ్యక్షుడికి మీడియా ప్రతినిధిగా వ్యవహరిస్తున్న కేటీ మిల్లర్‌ అనే మహిళకు కరోనా సోకింది. ఈమె అధ్యక్షుడు ట్రంప్‌ ముఖ్య ఉద్యోగి స్టీఫెన్‌ మిల్లర్‌ సతీమణి. తాజా ఘటనతో శ్వేతసౌధంలో కరోనా బాధితుల సంఖ్య రెండుకు చేరింది. 

విధి నిర్వహణలో భాగంగా కేటీ మిల్లర్‌ వైట్‌హౌస్‌లో నిర్వహించిన అనేక కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. గురువారం కూడా ఆమె పాల్గొన్న ఓ బహిరంగ ప్రార్థనా సమావేశంలో... అధ్యక్షుడు ట్రంప్‌ సతీమణి మెలానియా, ఉపాధ్యక్షుడి భార్యతో సహా పదుల సంఖ్యలో ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్‌, పెన్స్‌లకు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిద్దరికీ నెగిటివ్‌ అని తేలింది. ఇకనుంచి వారిరువురికీ ప్రతిరోజూ కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే అధ్యక్షుడి భద్రత విషయమై ఆందోళన చెందనవసరం లేదని శ్వేతసౌధం అధికారులు వెల్లడించారు. అధ్యక్ష భవనంలో పరిసరాలను క్రిమిరహితం చేయటం, కనీసం ఆరు అడుగుల సామాజిక దూరం పాటించటం వంటి కరోనా జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా తీసుకుంటున్నామని వారు వివరించారు. అయితే ట్రంప్‌ మాత్రం వివిధ కార్యక్రమాలకు మాస్క్‌ ధరించకుండానే హాజరవుతుండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని