భారత్‌లో 2వేలు దాటిన కరోనా మరణాలు!

భారత్‌లో కరోనా మహమ్మారి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా సరాసరి ప్రతిరోజు మూడువేల పాజిటివ్‌ కేసులుతో పాటు వంద మరణాలు సంభవిస్తున్నాయి. శనివారం ఒక్కరోజే 3277 కేసులు నమోదుకావడంతోపాటు 128 మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated : 10 May 2020 12:25 IST

దిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా సరాసరి ప్రతిరోజు మూడువేల పాజిటివ్‌ కేసులుతో పాటు వంద మరణాలు సంభవిస్తున్నాయి. శనివారం ఒక్కరోజే దేశంలో 3277 కేసులు నమోదుకావడంతోపాటు 128 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆదివారం ఉదయానికి దేశంలో కరోనా మృతుల సంఖ్య 2109కి చేరగా మొత్తం బాధితుల సంఖ్య 62,939గా నమోదైంది. మొత్తం కరోనా బాధితుల్లో ఇప్పటివరకు 19,358మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా మరో 41,472 మంది చికిత్స పొందుతున్నారు.  

మహారాష్ట్రలో 779, గుజరాత్‌లో 472 మరణాలు..

మహారాష్ట్రలో కొవిడ్‌-19 తీవ్రత కొనసాగుతూనే ఉంది. రోజుకు కొత్తగా వెయ్యి కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20,228కి చేరగా 779మంది మృత్యువాతపడ్డారు. ముంబయి మహానగరంలో కొవిడ్‌-19 తీవ్రత కలవరపెడుతోంది. ఒక్క ముంబయి నగరంలోనే కరోనా బాధితుల సంఖ్య 12వేలు దాటగా పుణెలో 2,700కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర తరువాత అత్యధిక తీవ్రత గుజరాత్‌లో ఉంది. అంతేకాకుండా గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లలో మరణాల రేటు కలవరపెడుతోంది. గుజరాత్‌లో ఇప్పటివరకు మొత్తం 7796 కేసులు నమోదు కాగా 472మంది మృత్యువాతపడ్డారు. మధ్యప్రదేశ్‌లోనూ కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 3614 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా ఇప్పటివరకు 215మంది మరణించారు. దేశ రాజధాని దిల్లోలో వైరస్‌ బారినపడినవారి సంఖ్య 6542కి చేరగా 73మంది మరణించారు. తమిళనాడులో వైరస్‌ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6535కి చేరగా 44మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ బెంగాల్‌లోనూ కరోనా మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 171మంది మృత్యువాతపడగా మొత్తం 1786 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్‌లో ఇప్పటివరకు కరోనా సోకిన ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య 100దాటింది. ఇక్కడ 3708 కేసులు నమోదుకాగా 106 మంది మరణించారు.  

ఆంధ్రప్రదేశ్‌లో 1930, తెలంగాణలో 1163 కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో నిన్న ఒక్కరోజే 43పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 1930కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 44మంది చనిపోయారు. ఇక తెలంగాణలో నిన్న కొత్తగా 31 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1163కి చేరగా 30మంది ప్రాణాలు కోల్పోయారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని