లాక్‌డౌన్‌ 4.0 గైడ్‌లైన్స్‌ ఇవే..

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మే 31 వరకు కేంద్రం పొడిగించింది. నేటితో మూడో విడత లాక్‌డౌన్‌ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో జాతీయ విపత్తు

Updated : 17 May 2020 21:21 IST

రాష్ట్రాల అనుమతి మేరకు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు

సినిమా హాళ్లు, షాషింగ్స్‌మాల్స్‌కు అనుమతి లేదు

రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగింపు

దిల్లీ: దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మే 31 వరకు కేంద్రం పొడిగించింది. నేటితో మూడో విడత లాక్‌డౌన్‌ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌‌డీఎంఏ) పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ 4.0కు సంబంధించిన మార్గదర్శకాలను హోంశాఖ విడుదల చేసింది. రైలు, విమాన, మెట్రో సర్వీసులపై మే 31 వరకు నిషేధం కొనసాగుతుందని స్పష్టంచేసింది. అదే సమయంలో కంటైన్‌మెంట్‌ జోన్ల మినహా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడుపుకొనేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే, రాష్ట్రాల పరస్పర అంగీకారంతో వీటిని నడుపుకోవచ్చని హోంశాఖ స్పష్టంచేసింది.

లాక్‌డౌన్‌ 4.0 లో వీటికి అనుమతి లేదు

* దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అనుమతి లేదు.

* మెట్రో రైలు సేవలకు అనుమతి ఉండదు.

* పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు/కోచింగ్‌ సెంటర్లు బంద్‌.

* హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర సేవలకు అనుమతి లేదు.

* సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌, ఇతర వినోద ప్రాంతాలు తెరిచేందుకు అనుమతి లేదు.

* రాజకీయ, సామాజిక, క్రీడా, వినోదాలకు సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలకూ అనుమతి లేదు.

* మతపరమైన సంస్థల్లో ప్రజలకు అనుమతి లేదు. మతపరమైన ఎటువంటి కార్యక్రమాలూ నిర్వహించడానికి లేదు.

* కంటైన్‌మెంట్‌ జోన్లలో బస్సు సర్వీసులకు అనుమతి లేదు


లాక్‌డౌన్‌ 4.0 లో వీటికి గ్రీన్‌ సిగ్నల్‌

* ఇంటికి సరఫరా చేస్తున్న రెస్టారెంట్లు కిచెన్‌లు తెరిచేందుకు అనుమతులు.

* బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఉన్న క్యాంటీన్లు నడిపేందుకు అనుమతులు.

* వైద్య, పోలీస్, ప్రభుత్వ ఉద్యోగులు, హెల్త్‌కేర్‌ వర్కర్లలకు సేవలందించే, క్వారంటైన్‌లో ఉన్న పర్యాటకులకు వసతి కల్పించే వాటికి అనుమతి ఉంటుంది.

* దేశీయంగా మెడికల్‌ సేవలు, దేశీయ ఎయిర్‌ అంబులెన్స్‌లు, భద్రతకు సంబంధించినవి, ఎంఏహెచ్‌ అనుమతించిన వాటికి మినహాయింపు ఉంటుంది.

* ప్రేక్షకులు లేకుండా క్రీడా కేంద్రాలు తెరిచేందుకు అనుమతి

* ఆన్‌లైన్‌/డిస్టెన్స్‌ లెర్నింగ్‌ ఎప్పటిలాగే కొనసాగుతుంది.

బస్సు సర్వీలు అలా..

* రాష్ట్రాల మధ్య సమన్వయం మేరకు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు, వాహన ప్రయాణాలకు అనుమతి.

* అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడిపే విషయంలో ఆయా  రాష్ట్ర ప్రభుత్వాలే తుది నిర్ణయం తీసుకుంటాయి.

కంటైన్మెంట్‌, బఫర్‌, రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లు ఇలా..

* ఎక్కడెక్కడ రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లు ఏర్పాటు చేయాలన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణయిస్తాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా వాటిని పరిగణించాల్సి ఉంటుంది.

* రెడ్‌, ఆరెంజ్‌, కంటైన్మెంట్‌, బఫర్‌ జోన్ల సరిహద్దులు ఆ జిల్లా అధికారులు నిర్ణయిస్తారు. అవి కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గనిర్దేశాలకు అనుగుణంగా ఉండాలి.

* కంటైన్మెంట్‌ జోన్లలో అత్యవసర సేవలు మినహా ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదు. ప్రజలు రోడ్లమీదకు రాకూడదు.

* కంటైన్మెంట్‌ జోన్లలో ప్రతి ఇంటిపైనా నిఘా ఉండాలి. అవసరమైన వైద్య పరీక్షలు, సేవలు అందించాలి.

* 65 ఏళ్లు పైబడిన వారు, గర్భిణీ స్త్రీలు, 10 ఏళ్లలోపు చిన్న పిల్లలను తప్పనిసరి అయితే తప్ప ఇంటి నుంచి బయటికి రానీయవద్దు.

రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుందిలా..
రాత్రి 7గం. నుంచి ఉదయం 7గం. వరకూ కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుంది. (అత్యవసర సేవలు మినహా) ఇందుకు సంబంధించి స్థానిక అధికారులు ఆదేశాలు జారీ చేయాలి. అన్ని ప్రాంతాల్లోనూ 144వ సెక్షన్‌ అమలు చేయాలి.

ఆరోగ్య సేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి

* ఆఫీస్‌లు, పని ప్రదేశాల్లో ఉద్యోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా స్మార్ట్‌ఫోన్‌ వినియోగించే ప్రతి ఉద్యోగి ఆరోగ్య సేతు యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకునేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి.

* స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులందరూ ఆరోగ్యసేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేలా జిల్లా అధికారులు అవగాహన కల్పించాలి.

సరకు రవాణకు అనుమతి

* నర్సులు, పారా మెడికల్‌ స్టాఫ్‌, పారిశుద్ధ్య కార్మికులు, అంబులెన్సులకు, ఔషధ నిపుణులకు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లవచ్చు. వారికి ఎలాంటి నిబంధనలూ ఉండవు.

* వస్తు రవాణ, కార్గో సేవలు, చివరకు ఖాళీ ట్రక్కులను అన్ని రాష్ట్రాలు అనుమతించాలి. వీటికి అడ్డు చెప్పకూడదు.

* పొరుగు దేశాల ద్వారా వచ్చే వస్తువులు, కార్గో సేవలను అందిస్తున్న అన్ని వాహనాలను రాష్ట్రాలు అనుమతించాలి.

* డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ 2005 ప్రకారం ఇవన్నీ అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. వీటికి ఎలాంటి ఆటంకాలు కలిగినా డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌లు తగిన చర్యలు తీసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని