‘గ్రీన్’ చూపిస్తే..‘నో’ క్వారంటైన్‌

ఆరోగ్యసేతు యాప్‌లో ‘గ్రీన్’ స్టేటస్‌ చూపిస్తే క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్ పూరి స్పష్టం చేశారు.

Published : 23 May 2020 18:02 IST

ఆన్‌లైన్‌ చర్చలో స్పష్టం చేసిన హర్దీప్‌ సింగ్ పూరి


దిల్లీ: ఆరోగ్య సేతు యాప్‌లో ‘గ్రీన్’ స్టేటస్‌ చూపిస్తే క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్ పూరి స్పష్టం చేశారు. మే 25 నుంచి దేశీయ విమాన ప్రయాణాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ఆన్‌లైన్‌ ద్వారా నెటిజన్ల అనుమానాలను నివృత్తి చేశారు. గురువారం కూడా క్వారంటైన్‌ గురించి ఆయన ఇదే విషయం చెప్పిన సంగతి తెలిసిందే. 

‘ఆరోగ్య సేతు యాప్‌లో గ్రీన్‌ స్టేటస్‌ చూపించాక కూడా ప్రయాణికులను క్వారంటైన్‌లో ఉంచాల్సిన అవసరం ఏంటో అర్థం కావడం లేదు’ అని హర్దీప్‌ సింగ్ అన్నారు. అలాగే ఆగష్టు, సెప్టెంబరు కంటే ముందే చెప్పుకోదగ్గ సంఖ్యలోనే విదేశీ విమాన ప్రయాణాలు ప్రారంభమవుతాయని ఆశిస్తున్నామన్నారు. అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. దేశీయ ప్రయాణాల నేపథ్యంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి కొన్ని రాష్ట్రాలు మాత్రం ప్రయాణికులను క్వారంటైన్ ఉంచాలంటూ పట్టుబడుతున్నాయి. దానిపై ఆన్‌లైన్‌ చర్చలో కొందరు ఆందోళన వ్యక్తం చేయగా..క్వారంటైన్‌ కానీ, ఐసోలేషన్ కానీ అవసరం లేదన్నారు. 

క్వారంటైన్‌పై రాష్ట్రాలు పట్టుబట్టడంపై గతంలో కూడా మంత్రి స్పందించారు. ‘క్వారంటైన్ గురించి ఎందుకు అనవసర చర్చ పెడుతున్నారో తెలియడం లేదు. ఇది దేశీయ విమానయానం. బస్సు, రైల్లో ప్రయాణించినట్లే ఇది కూడా. అసలు కరోనా పాజిటివ్ ఉన్నవాళ్లు విమాన ప్రయాణం చేయడానికి అనుమతించం’ అని తెలిపారు. ఒకవైపు కరోనా కేసులు పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నా.. శ్రామిక రైళ్లు, ప్రత్యేక రైళ్లతో పాటు, మే 25 నుంచి దేశీయ విమానాలు, జూన్‌ ఒకటి నుంచి 200 ప్యాసింజర్‌ రైళ్లను నడపడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని