వలస కూలీల కోసం ఏం చేశారో చెప్పండి? 

కరోనా వైరస్‌తో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కూలీలు అనుభవించిన కష్టాలపై సుప్రీంకోర్టు స్పందించింది. స్వస్థలాలకు వెళ్లే క్రమంలో.......

Published : 26 May 2020 20:17 IST

వలస కూలీల అవస్థలపై ‘సుప్రీం’ సుమోటో విచారణ 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు

దిల్లీ: కరోనా వైరస్‌తో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కూలీలు అనుభవించిన కష్టాలపై సుప్రీంకోర్టు సుమోటోగా స్పందించింది. స్వస్థలాలకు వెళ్లే క్రమంలో వారు పడిన అవస్థలపై పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారంగా తీసుకొని ఈ అంశాన్ని సుమోటోగా విచారణ చేపట్టింది. నిలువ నీడలేక, పస్తులుండలేక ఎలాగైనా తమ స్వస్థలాలకు వెళ్లానే సంకల్పంతో వలస కూలీలు కాలినడకన, సైకిళ్లపైన వందల కి.మీలు మేర ప్రయాణం చేయడంపై వివిధ పత్రికలు, మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వలస కూలీల కష్టాలపై తమకు కొన్ని లేఖలు కూడా వచ్చాయనీ.. సమాజంలో పలు వర్గాల ప్రజల నుంచి వినతిపత్రాలు వచ్చాయని ధర్మాసనం తెలిపింది.  

వలస కూలీలు చిక్కుకున్న చోట లేదా వారు ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో వారికి ఎక్కడా ఆహారం, మంచినీళ్లు కూడా ప్రభుత్వాలు కల్పించలేదని ఫిర్యాదులు అందాయని  తెలిపింది. వలస కూలీలకు తక్షణమే ఉచితంగా తగిన రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు ఆహారం, వసతి ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆయా ప్రభుత్వాలు ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. అవి లోపభూయిష్టంగా ఉన్నాయంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీచేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. వారి స్పందనను తెలియజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 28కి వాయిదా వేసింది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలంటూ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని