సొంతూళ్లకు కార్మికులు..కొత్తగా హాట్‌స్పాట్లు

గత మూడువారాల్లో కొవిడ్-19 కేసులు నమోదవుతున్న 145 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

Published : 31 May 2020 00:51 IST

కేసులు నమోదవుతున్న 145 జిల్లాల గుర్తింపు: కేంద్రం

దిల్లీ: గత మూడువారాల్లో కొవిడ్-19 కేసులు నమోదవుతున్న 145 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఆ ప్రాంతాల్లో వైరస్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే అవి వైరస్‌కు కేంద్రస్థానాలుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ సందర్భంగా రాష్ట్రాల ప్రతినిధులతో మాట్లాడుతూ కేబినెట్ సెక్రటరీ రాజీవ్‌గౌబా పలు విషయాలు వెల్లడించారు. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వలస కార్మికులు తిరిగి సొంతరాష్ట్రాలకు వెళ్తుండటంతో తూర్పు భారతం ఇప్పుడు కరోనా హాట్‌స్పాట్‌గా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బిహార్‌, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కరోనా తీవ్రత తక్కువగా ఉందని, కానీ గత మూడు వారాల నుంచి మే 25 వరకు నమోదవుతున్న కేసుల్లో వేగం పెరిగిందన్నారు. గతంలో పది కంటే తక్కువ కేసులున్న త్రిపుర, మణిపూర్‌లో కూడా ఇదే తీరు కనిపిస్తోందని వెల్లడించారు. 

ఇప్పటివరకు మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, దిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ వంటి పెద్ద రాష్ట్రాలే భారీ సంఖ్యలో కేసులకు కారణమయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మే 13 వరకు 75,000 కేసులుండగా, గత 14 రోజుల్లో ఆ పెరుగుదల చాలా వేగంగా ఉందన్నారు. అయితే కొద్ది రోజులుగా బిహార్, ఝార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల్లో ఈ పెరుగుదల వేగంగా ఉందని తెలిపింది. ‘వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వలస కార్మికులు తిరిగి సొంత రాష్ట్రాలకు వెళ్తుండటంతో తూర్పు భారతదేశంలో కేసుల పెరుగుదలకు ప్రధాన కారణం. తరలివెళ్లే కార్మికులు పెద్ద సంఖ్యలో ఉండటం, రైళ్లు, బస్‌స్టేషన్లలో సరైన పరీక్షా విధానం లేకపోవడంతో చాలామంది వైరస్‌ వాహకులుగా ఉంటున్నారు’ అని ఓ అధికారి వెల్లడించారు. కాగా, మంత్రిత్వ శాఖ 145 జిల్లాలను గుర్తించిందని, ఆయా ప్రాంతాల్లో రాష్ట్రాలు వైరస్‌ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాజీవ్ సూచించారు. తాము గుర్తించిన కొన్ని జిల్లాల్లో 20కి పైగా కేసులు ఉన్నాయని, అక్కడి యంత్రాంగాలు తగిన చర్యలు తీసుకోపోతే అవి కొత్త వైరస్‌ కేంద్రాలుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.  

‘కేసులు సంఖ్య పెరుగుతుందని అందరు అంచనా వేస్తున్నారు. దానర్థం లాక్‌డౌన్‌ విఫలమైందని కాదు.  వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి లాక్‌డౌన్‌ చాలా ఉపకరించింది’ అని ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు డాక్టర్ కేకే అగర్వాల్ అన్నారు. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఇప్పటికీ మనదేశంలో మరణాల సంఖ్య, కేసుల నిర్ధారణ రేటు తక్కువగానే ఉందని వెల్లడించారు.

ఇవీ చదవండి:

భారత్‌లో 24 గంటల్లో 7964 కొత్త కేసులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని