ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలి: మోదీ

కరోనాపై చేస్తున్న పోరాటం మరింత సమర్థంగా కొనసాగాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోందని తెలిపారు.......

Updated : 31 May 2020 14:46 IST

దేశ ప్రజలకు ప్రధాని పిలుపు

దిల్లీ: కరోనాపై చేస్తున్న పోరాటం మరింత సమర్థంగా కొనసాగాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోందని తెలిపారు. ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కోరారు. కరోనా సమయంలో ఎంతోమంది కొత్త కొత్త ఆవిష్కరణలకు నాంది పలికారని గుర్తుచేశారు. కరోనా కట్టడి కోసం అన్ని వర్గాల ప్రజలు చేస్తున్న విశేష కృషిని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు. ఈ మేరకు ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం ద్వారా తాజా పరిస్థితులపై తన మనసులోని మాటల్ని ప్రధాని దేశ ప్రజలతో పంచుకున్నారు.

ఆయన ప్రసంగంలోని మరిన్ని కీలకాంశాలు...
> కరోనాపై పోరులో మహిళలు విశేష సేవలందించారు. మాస్కులు తయారుచేసి మహిళా సంఘాలు చేయూతనందించాయి. ఇలా అన్ని వర్గాలవారు తమ సేవానిరతిని ప్రదర్శించి మనదేశ సంస్కృతి గొప్పతనాన్ని చాటారు.
> కరోనా సమయంలో అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా పేదలు, కూలీలు పడ్డ కష్టాలు వర్ణనాతీతం. వలసకూలీల తరలింపునకు శ్రామిక్‌ రైళ్లు నడుపుతున్నాం.
> ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి ప్రకటించిన ‘ఆత్మనిర్భర్‌’ కార్యక్రమం ద్వారా దేశం ఉన్నతస్థితికి చేరుతుంది.
> కరోనా వైరస్‌ శ్వాస వ్యవస్థను దెబ్బతీస్తుంది. దీన్ని యోగా ద్వారా అధిగమించవచ్చు. దీనిపై అవగాహన పెంచేందుకు ఆయుష్‌ శాఖ ‘మై లైఫ్‌-మై యోగా’ బ్లాగ్‌ను ప్రారంభించింది.
> కరోనా సమయంలో ఎంతోమంది కొత్త కొత్త ఆవిష్కరణలకు నాంది పలికారు. విద్యారంగంలోనూ ఎన్నో ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాల కోసం సరికొత్త పద్ధతులను అందుబాటులోకి తెచ్చారు.
> నిరుపేదలకు ఆయుష్మాన్‌ భారత్‌ వరంగా మారింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కోటి మంది చికిత్స పొందారు. ఈ కార్యక్రమం వల్ల పేదవారి సొమ్ము ఆదా అవుతోంది.
> అంపన్‌ పెనుతుపానుతో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ఇటువంటి విపత్తు సమయంలో అక్కడి ప్రజలు చూపిన తెగువ, ధైర్యం ఎనలేనివి.
> మిడతల దండు ద్వారా ప్రభావితమైనవారందరికీ కేంద్రం అండగా నిలుస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని