వారిని 15రోజుల్లోనే తరలించాలి: సుప్రీం

లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కూలీలను తరలించే ప్రక్రియను మరో 15రోజుల్లో పూర్తిచేయాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు సూచించింది. వలస కూలీలు సొంత రాష్ట్రాలకు చేరుకున్న అనంతరం వారి పూర్తి వివరాలు గ్రామాల వారీగా నమోదు చేయాలని సూచించింది. అంతేకాకుండా వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది. వీటికి సంబంధించిన ఆదేశాలను మంగళవారం జారీ చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది.

Published : 05 Jun 2020 17:30 IST

వలస కార్మికుల తరలింపుపై సుప్రీంకోర్టు గడువు

దిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కూలీలను తరలించే ప్రక్రియను మరో 15రోజుల్లో పూర్తిచేయాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు సూచించింది. వలస కూలీలు సొంత రాష్ట్రాలకు చేరుకున్న అనంతరం వారి పూర్తి వివరాలు గ్రామాల వారీగా నమోదు చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది. వీటికి సంబంధించిన ఆదేశాలను మంగళవారం జారీ చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. వలస కూలీల అంశాన్ని సుమోటోగా తీసుకొని విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు తాజాగా ఈ విధంగా స్పందించింది. విచారణ సందర్భంలో సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సుప్రీంకోర్టుకు విన్నవించారు.

దేశవ్యాప్తంగా జూన్‌ 3వ తేదీ నాటికి 4,228వేల రైళ్ల ద్వారా దాదాపు 57లక్షల మంది వలస కార్మికులను వారి సొంత ప్రాంతాలకు తరలించామని సొలిసిటర్‌ జనరల్‌ సుప్రీంకోర్టుకు తెలిపారు. మరో 41లక్షల మంది సొంత వాహనాలతో స్వస్థలాలకు తరలివెళ్లారని తెలిపారు. రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ వీరిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని విన్నవించారు. వలస కార్మికుల తరలింపు కోసం రాష్ట్రాల నుంచి వచ్చిన వినతుల ప్రకారమే ఈ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దీనిలో భాగంగా మరో 171 శ్రామిక్ రైళ్ల కోసం రాష్ట్రాల నుంచి వినతులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ సందర్భంలో మహారాష్ట్ర నుంచి మరో ఒక్క రైలు కోసమే వినతి వచ్చిందని తెలపడంతో సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అయితే మహారాష్ట్ర నుంచి ఇప్పటికే 802 రైళ్లను నడిపినట్లు ఎస్‌జీ సమాధానమిచ్చారు. ఈ సందర్భంలో పలు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలను కోర్టు ముందుంచాయి.

*ఇప్పటికే 11 లక్షల మందిని తరలించామని, మరో 38 వేల మందిని తరలించాల్సి ఉందని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది

*రాష్ట్రానికి చెందిన 22లక్షల మంది వలస కార్మికుల్లో 20.5 లక్షల మందిని తరలించినట్లు గుజరాత్ పేర్కొంది

*దిల్లీ నుంచి 3 లక్షల మందిని తరలించామని.. మరో 2 లక్షల మంది వలస కూలీలు ఉన్నారని ఏఎస్జీ వెల్లడించారు

*ఇప్పటివరకు 21 లక్షల 69వేల మంది వలస కూలీలను వెనక్కి రప్పించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది

*28 లక్షల మంది వలస కూలీలు వెనక్కి వచ్చినట్లు బీహార్ పేర్కొంది

*మరో 6 లక్షల మంది వలసకూలీలు రాష్ట్రానికి రావాల్సి ఉందని పశ్చిమ బంగా వెల్లడించింది

*అఫిడవిట్ సమర్పించడానికి మరికొంత సమయం కోరిన తమిళనాడు

*25వేల మంది ఇంకా వెనక్కి రావాల్సి ఉందన్న మధ్యప్రదేశ్

*13 లక్షల మంది వలస కూలీలు తిరిగి రాష్ట్రానికి వచ్చినట్లు రాజస్థాన్ తెలిపింది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని