‘పాక్లో ఉగ్రవాదులు ఉన్నారన్నది ఇమ్రాన్ మాటే’
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోందన్న ఐరాస భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) నివేదికలో కొత్తేమీ లేదని.. గతంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంగీకరించిన విషయాన్నే అది పునరావృతం.......
ఐరాస నివేదికపై పాక్ బుకాయింపును తిప్పికొట్టిన భారత్
దిల్లీ: పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోందన్న ఐరాస భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) నివేదికలో కొత్తేమీ లేదని.. గతంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంగీకరించిన విషయాన్నే అది పునరావృతం చేసిందని భారత విదేశాంగ కార్యదర్శి అనురాగ్ శ్రీవాస్తవ గుర్తుచేశారు. పాకిస్థాన్ ఇప్పటికైనా తమ విధానాన్ని మార్చుకొని.. తమ గడ్డపై నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదానికి స్వస్తి పలకాలని సూచించారు.
గత నెల విడుదలైన ఓ నివేదికలో పాక్ ఉగ్రవాద కార్యకలాపాల్ని యూఎస్ఎస్సీ నివేదిక ఒకటి బట్టబయలు చేసింది. అఫ్గానిస్థాన్ గడ్డపై కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఉగ్రమూకల్లో దాదాపు 6,500 మంది పాకిస్థాన్కు చెందినవారు ఉన్నారని నివేదిక కుండబద్దలు కొట్టింది. జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రసంస్థలు ముష్కరులను ఎగుమతిచేసే ప్రక్రియలో నిమగ్నమై ఉన్నాయని తేల్చి చెప్పింది. దీనిపై స్పందించిన భారత్ పాక్ నిజస్వరూపాన్ని నివేదిక కుండబద్దలు కొట్టిందని వ్యాఖ్యానించింది.
పాక్ విదేశాంగ శాఖ దీనిపై స్పందిస్తూ.. నివేదికలోని అంశాల్ని భారత్ వక్రీకరిస్తోందని బుకాయించే ప్రయత్నం చేసింది. దీనికి భారత్ దీటుగా బదులిచ్చింది. ‘‘గత ఏడాది ఓ సందర్భంలో 30 వేల నుంచి 40 వేల మంది ఉగ్రవాదులు పాక్ గడ్డపై ఉన్నారన్న మీ ప్రధాని(ఇమ్రాన్ ఖాన్) మాటల్ని గుర్తుకుతెచ్చుకోండి. ఆయన అంగీకరించిన వాస్తవాన్నే నివేదిక ఉటంకించింది. నివేదికపై నిందారోపణలు చేయడానికి బదులు ఆత్మవిమర్శ చేసుకొని పాక్ గడ్డపై నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదానికి స్వస్తి పలకాలి’’ అంటూ అక్కడి విదేశాంగ శాఖకు చురకలంటించింది.
గత ఏడాది జులైలో అమెరికాలో ఓ సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. తమ దేశంలో ఇప్పటికీ 30 వేల నుంచి 40 వేల మంది ఉగ్రవాదులు ఉన్నట్లు అంగీకరించారు. వీరంతా అఫ్గాన్ లేదా కశ్మీర్లో దాడులు చేసేందుకు శిక్షణ పొందారని వ్యాఖ్యానించారు. గత పాలకులు చేసిన తప్పిదాల వల్లే ఇప్పుడు పాకిస్థాన్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందంటూ నిరాశావాదాన్ని ప్రదర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా