పాకిస్థాన్‌ మాజీ ప్రధానికి కరోనా!

ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి పాకిస్థాన్‌ రాజకీయ నాయకులను వెంటాడుతోంది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కరోనా సోకి మృతిచెందగా, మరికొందరు కొవిడ్‌ బారినపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

Published : 09 Jun 2020 02:02 IST

పాక్‌ రాజకీయ నాయకులను వెంటాడుతున్న కొవిడ్‌-19 

ఇస్లామాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి పాకిస్థాన్‌ రాజకీయ నాయకులను వెంటాడుతోంది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కరోనా సోకి మృతిచెందగా, మరికొందరు కొవిడ్‌ బారినపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. తాజాగా పాకిస్థాన్‌ మాజీ ప్రధాని షాహిద్‌ ఖకాన్‌ అబ్బాసీకి కరోనా వైరస్‌ సోకింది. దీంతో అతన్ని ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ పార్టీ అధికార ప్రతినిధి వెల్లడించారు. షాహిద్‌ ఖకాన్‌ 2017 ఆగస్టు నుంచి మే 2018వరకు పాకిస్థాన్‌ ప్రధానిగా పనిచేశారు. పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీకి చెందిన మరో ముఖ్యనేత షార్జీల్‌ మెమెన్‌కు కరోనా వైరస్‌ నిర్ధారణ అయినట్లు ఆ పార్టీ ప్రకటించింది. అంతేకాకుండా, మరో రాజకీయ పార్టీ ఎంక్యూఎంకు చెందిన షహానా అషర్‌ కూడా ఈ వైరస్‌ బారినపడటం గమనార్హం.

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ అసెంబ్లీ సభ్యుడు షౌకత్‌ మంజూర్‌ ఛీమా గత వారమే కరోనా సోకి ప్రాణాలు కోల్పోయాడు. కే-పీ(ఖైబర్‌ పాక్తుంఖ్వా) అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్న జంషీదుద్దీన్‌, సింధ్‌ ప్రాంతానికి చెందిన మంత్రి గులాం ముర్తజా బలోచ్‌లు కూడా కరోనా కాటుకు మృత్యువాతపడ్డారు. వీరితోపాటు కే-పీ అసెంబ్లీలో మరోముగ్గురు శాసనసభ్యులు కూడా కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారు.

ఇదిలా ఉంటే, పాకిస్థాన్‌లో తొలుత మందకొడిగా సాగిన కరోనావైరస్‌ వ్యాప్తి తాజాగా ఉగ్రరూపం దాలుస్తోంది. సోమవారం ఉదయానికి ప్రపంచంలో లక్షకుపైగా కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో పాకిస్థాన్‌ చేరింది. దీంతో అత్యధిక కరోనా తీవ్రత ఉన్న దేశాల్లో పాకిస్థాన్‌ ప్రపంచంలోనే 15వ స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు పాకిస్థాన్‌లో లక్షా మూడువేల పాజిటివ్‌ కేసులు బయటపడగా.. 2067మంది మృత్యువాతపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని