
నవంబర్లో ‘పీక్’కు కొవిడ్..!
అప్పుడు ఐసీయూ, వెంటిలేటర్ల కొరత
ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడి
దిల్లీ: యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మహమ్మారి.. భారత్లో నవంబర్ మధ్య నాటికి గరిష్ఠ స్థాయికి (పీక్) చేరుకుంటుందని ఓ అధ్యయనంలో తేలింది. అప్పుడు ఐసీయూ పడకలు, వెంటిలేటర్ల కొరత ఏర్పడొచ్చని అంచనా వేసింది. అయితే, 8 వారాల లాక్డౌన్ వల్ల కరోనా గరిష్ఠస్థాయిని చేరుకోవడం కొద్దికాలం పాటు వాయిదా పడిందని తెలిపింది. అదే సమయంలో ప్రజారోగ్య మౌలిక సదుపాయాల మెరుగుకు లాక్డౌన్ ఉపయోగపడిందని తెలిపింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఏర్పాటు చేసిన ఆపరేషన్ రీసెర్చి గ్రూప్కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
కరోనా మహమ్మారి నియంత్రణకు కేంద్రం విధించిన లాక్డౌన్ వల్ల కరోనా గరిష్ఠ స్థాయిని చేరుకోవడం సుమారు 34 నుంచి 76 రోజుల పాటు వాయిదా పడిందని పరిశోధకులు తేల్చారు. 69 నుంచి 97 శాతం ఇన్ఫెక్షన్ రేటును తగ్గించడానికి కారణమైందని అధ్యయనంలో తేలింది. లాక్డౌన్ తర్వాత సుమారు 60 శాతం మేర ప్రజారోగ్య వ్యవస్థ పటిష్ఠమైందని తెలిపింది. ఈ ప్రజారోగ్య చర్యలు నవంబర్ మొదటి వారం వరకు డిమాండ్ను అందుకుంటాయని, అనంతరం కొరత ఏర్పడొచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
ఆ తర్వాత ఐసోలేషన్ పడకలు 5.4 నెలల వరకు, ఐసీయూ పడకలు 4.6 నెలలు, వెంటిలేటర్లు 3.9 నెలల పాటు సరిపోకపోవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ఒకవేళ లాక్డౌన్ విధించకపోయి, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకపోయి ఉంటే ఎదురయ్యే డిమాండ్తో పోలిస్తే ఇది 83 శాతం తక్కేవేనని తెలిపారు. అదే సమయంలో ప్రజారోగ్య వ్యవస్థను 80 శాతం మేర పెంచి ఉంటే ఈ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలయ్యేదని అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఈ మహమ్మారి కోసం ప్రజారోగ్య వ్యవస్థపై వెచ్చించే మొత్తం జీడీపీలో 6.2 శాతం ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేశారు.
ప్రస్తుత స్థితి ఇదీ...
దేశంలో జూన్ 9 నాటికి 958 కొవిడ్-19 ఆస్పత్రుల్లో 1,67,883 ఐసోలేషన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. అలాగే 21,614 ఐసీయూ, 73,469 ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. ఇవి కాకుండా 2,313 కొవిడ్ హెల్త్ సెంటర్లలో 1,33,037 ఐసోలేషన్, 10,748 ఐసీయూ, 46,635 ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. ఇవికాక 7,525 కొవిడ్ కేర్ సెంటర్లలో 7,10,642 పడకలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో 21,494 వెంటిలేటర్లు ఉన్నాయని, మరో 60,848 వెంటిలేటర్లకు ఆర్డర్ చేసినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.