భారత్‌ కంటే వారి వద్దే ఎక్కువ అణ్వాయుధాలు...

 చైనా, పాకిస్థాన్‌ల వద్ద భారత్‌ కంటే ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయని స్వీడన్‌కు చెందిన ‘స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ (ఎస్‌ఐపీఆర్‌ఐ-సిప్రి) అభిప్రాయపడింది.

Published : 15 Jun 2020 14:37 IST

వెల్లడించిన సిప్రి

దిల్లీ: చైనా, పాకిస్థాన్‌ల వద్ద భారత్‌ కంటే ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయని స్వీడన్‌కు చెందిన ‘స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ (సిప్రి) అభిప్రాయపడింది. ప్రపంచంలో ఇప్పటి వరకు అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా, ఇండియా, పాకిస్థాన్‌, ఇజ్రాయెల్‌, ఉత్తర కొరియా దేశాలు అణ్వాయుధాలున్నాయి. వీటి వద్ద జనవరి 2020 నాటికి 13,400 అణ్వాయుధాలు ఉన్నట్లు ఈ అంతర్జాతీయ సంస్థ అంచనా వేసింది. అంతేకాకుండా చైనా వద్ద 320 న్యూక్లియర్‌ వార్‌హెడ్‌లు ఉండగా.. పాక్‌ వద్ద 160, భారత్‌ వద్ద 150 ఉన్నాయని ఆ సంస్థ తన ఇయర్ బుక్‌ 2020లో తెలిపింది. కాగా, లద్దాఖ్‌ వద్దనున్న వాస్తవాధీన రేఖ గురించి భారత్‌- చైనాల మధ్య వివాదం ముదురుతున్న నేపథ్యంలో... ఈ వివరాలు బయటకు రావడం ప్రాముఖ్యం సంతరించుకుంది.

స్వీడన్‌ ప్రభుత్వం 1966లో స్థాపించిన సిప్రి, ప్రపంచ దేశాల ఆయుధబలగాల స్థితిగతులు, అంతర్జాతీయ భద్రతను అంచనా వేస్తుంది. రష్యా వద్ద 6,375, అమెరికా 5,800లు అణ్వాయుధాలు ఉన్నాయని పేర్కొంది. ఈ రెండు దేశాల వద్దే ప్రపంచంలోని 90 శాతం కన్నా ఎక్కువ అణ్వాయుధాలను కలిగి ఉన్నట్లు సిప్రి వివరించింది. అంతర్జాతీయంగా అన్ని దేశాలూ తమ అణుబలగాన్ని ఆధునీకరిస్తున్నాయని పేర్కొంది. భారత్‌, పాక్‌లతో సహా పలుదేశాలు అణ్వాయుధ సమాచారాన్ని దాచిపెడుతున్నాయని ఈ సంస్థ ఆరోపించింది. కాగా, చైనా గతంలో కంటే ఎక్కువగా బలప్రదర్శన చేస్తోందని సిప్రి తెలిపింది.  ఈ సంస్థ కథనం ప్రకారం సైనిక వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల్లో అమెరికా, చైనాల తర్వాత భారత్‌ మూడో స్థానంలో ఉంది.  కాగా, 2019లో ప్రపంచ వ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్య తగ్గినట్లు ఈ సంస్థ ప్రకటించింది. గత సంవత్సరం 13,865గా ఉన్న ఈ సంఖ్య ప్రస్తుతం 13,400కి చేరినట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు