పాక్‌లో కరోనా కల్లోలం..

కరోనా వైరస్‌ ఉద్ధృతికి పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది

Published : 16 Jun 2020 01:26 IST

ఇస్లామాబాద్: కరోనా వైరస్‌ ఉద్ధృతికి పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. జులై నెల చివరికి అక్కడ కరోనా కేసులు సంఖ్య 12లక్షలకు చేరవచ్చని ఆ దేశ మంత్రి ఒకరు చెప్పడంతో భయాందోళనలు పెరుగుతున్నాయి. ‘ఇప్పుడు జూన్‌ నెల మధ్యలో ఉన్నాం. ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య సుమారు 1,50,000. కేసులు పెరుగుతున్న తీరును గమనించి, ఈ నెల చివరికి వాటి సంఖ్య రెట్టింపు అవుతుందన్న నిపుణుల అంచనా ఆందోళనకు గురిచేస్తోంది. ఇదే తీరుగా వైరస్‌ ఉద్ధృతి కొనసాగితే జులై చివరినాటికి కేసుల సంఖ్య 10 నుంచి 12 లక్షలకు చేరువవుతుంది’ అని ఆ దేశ మంత్రి అసద్ ఉమర్ వెల్లడించారు. ప్రజలు వైరస్‌ను సీరియస్‌గా తీసుకోవాలని, అందరు మాస్కులు ధరించాలని అభ్యర్థించారు. ఆ దేశంలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 6,825 వైరస్‌ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,39,230కి చేరింది. కాగా, కరోనాతో పాక్‌లోని పంజాబ్  తీవ్రంగా ప్రభావితమైంది. దేశంలోనే అత్యధికంగా 52,601 కేసులు నమోదయ్యాయి. 51,518 కేసులతో సింధ్ తరవాతి స్థానంలో ఉందని అక్కడి మీడియా వెల్లడించింది. 

ఇదిలా ఉండగా, కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ దీర్ఘకాలం కొనసాగితే, ఆర్థికంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జూన్‌ 13న పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ ఆందోళన వ్యక్తం చేసినట్లు రేడియో పాకిస్థాన్ వెల్లడించింది. ‘పాక్‌లాంటి దేశాలకు ఉన్న ఏకైక అవకాశం స్మార్ట్ లాక్‌డౌన్‌. అప్పుడు మాత్రమే పేదల మీద భారం పడదు’ అని ఆయన వెల్లడించినట్లు పేర్కొంది. ఆ దేశంలో 25 శాతం మంది ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని