కరోనా కాలం: సైకిళ్లకు భారీ డిమాండ్‌!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణతో చాలా దేశాల్లో వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. ముఖ్యంగా లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. జిమ్‌లు మూతపడ్డాయి. వ్యాయామం, కాలినడక కోసం కూడా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని దశాబ్దాల్లో చూడనివిధంగా ఒకేసారి సైకిళ్లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది.

Updated : 15 Jun 2020 22:15 IST

పెరిగిన డిమాండ్‌తో సైకిళ్ల కొరత

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణతో చాలా దేశాల్లో వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. ముఖ్యంగా లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. జిమ్‌లు మూతపడ్డాయి. వ్యాయామం, కాలినడక కోసం కూడా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని దశాబ్దాల్లో చూడనివిధంగా ఒకేసారి సైకిళ్లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ముఖ్యంగా అమెరికాలో అతిపెద్ద రిటైల్‌ మార్కెట్‌ వాల్‌మార్ట్‌, టార్గెట్‌ కేంద్రాలలో ఉన్న సైకిళ్ల ర్యాక్‌లన్నీ ఖాళీ అయ్యాయి. అంతేకాకుండా, చిన్న షాపుల్లోని సైకిళ్లు కూడా దాదాపు అమ్ముడుపోయాయి. అయితే, మహమ్మారి విజృంభణ కారణంగా అమెరికాలో గత రెండు నెలలుగా ఏర్పడ్డ చమురు సంక్షోభంతో సైకిల్‌ విక్రయాలు భారీగా పెరిగినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

లాక్‌డౌన్‌లతో భారీ డిమాండ్‌..

అమెరికాలో వైరస్‌ విజృంభణ ప్రారంభమైన తొలినాళ్లలో నిత్యావసర వస్తువుల కోసం ఎగబడినట్లుగా ప్రస్తుతం వీటికోసం పరుగెడుతున్నట్లు సైకిల్‌ ఇండస్ట్రీ నిపుణులు జయ్‌ టౌన్లీ తెలిపారు. ముఖ్యంగా చిన్నారుల సైకిళ్ల కంటే పెద్దవారు వాడే సైకిళ్లు, ఈ-బైకుల విక్రయాలు మూడింతలు పెరిగాయని మార్కెట్‌ విశ్లేషణ సంస్థ ఎన్‌పీడీ గ్రూప్‌ వెల్లడించింది. ఇక చిన్నారులు వాడే ఎలక్ట్రిక్‌ బైకుల విక్రయం కూడా రెట్టింపు అయినట్లు తెలిపింది. ఇలా స్వల్ప కాలంలోనే భారీగా డిమాండ్‌ పెరగడంతో అమెరికాలో సైకిళ్లకు భారీ కొరత ఏర్పడింది. అమెరికాలో లభించే దాదాపు 90శాతం సైకిళ్లు చైనా నుంచే దిగుమతి అవుతాయి. ప్రస్తుతం అక్కడ పూర్తిగా స్థాయిలో ఉత్పత్తి లేకపోవడంతో ఈ కొరత ఏర్పడినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది మరికొన్ని నెలలపాటు కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి..

కేవలం అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. మనీలా, రోమ్‌ నగరాల్లో కార్లను పార్కు చేసినట్లుగా ప్రస్తుతం భారీగా సైకిల్‌ పార్కింగ్‌లతో వీధులు నిండిపోతున్నాయి. ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో ప్రజలు సైకిళ్లవైపు మళ్లడమే దీనికి కారణమని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీనిలోభాగంగా, నగరంలో కొన్ని ప్రాంతాల్లో కార్లనే నిషేధించే దిశగా లండన్‌ మునిసిపాలిటీ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఇక ఫిలిప్పైన్స్‌లో సాధారణంగా క్రిస్మస్‌ సమయంలోనే బైకుల విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. లాక్‌డౌన్‌ అనంతరం ఇటలీలో ప్రభుత్వం బైకుల కొనుగోలుకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇస్తుండడంతో విక్రయాలు విపరీతంగా పెరిగాయి. మహమ్మారి విజృంభణ ప్రారంభమైనప్పటి నుంచి గత సంవత్సరంతో పోలిస్తే అమెరికాలో 138శాతం, బ్రిటన్‌లో 184శాతం తమ సైకిళ్ల అమ్మకాలు పెరిగాయని నెదర్లాండ్స్‌కు చెందిన ఈ-బైకర్‌ కంపెనీ వ్యాన్‌మూఫ్‌ వెల్లడించింది. దీంతో ఉత్పత్తి భారీగా పెంచినప్పటికీ డిమాండ్‌ను అధిగమించేందుకు మరో రెండు, మూడు నెలలు పట్టవచ్చని తెలిపింది. బెల్జియంకు చెందిన మరో ఈ-బైకర్‌ కంపెనీ కౌబాయ్‌ కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేసింది. 

అయితే సైకిళ్లతో పాటు ఈ-బైకులకు భారీ డిమాండు ఏర్పడడానికి పలు కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.

* ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణతో ప్రజారవాణ వ్యవస్థలకు దూరంగా ఉండటం
* కరోనా కారణంగా వ్యాయామంకోసం జిమ్‌లకు వెళ్లలేకపోవడం
* లాక్‌డౌన్‌లో ఇళ్లకే పరిమితమైన సమయంలో తమ పిల్లలు ఉత్సహం, వ్యాయామం కోసం సైకిళ్లు వాడటం
* మార్కెట్‌కు, ఆఫీసులకు వెళ్లేందుకు ఈ-బైక్‌లను వినియోగించడం
* భౌతిక దూరం పాటించడం కోసం సైకిళ్లు వాడటం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని