సరిహద్దులో ఉద్రిక్తత: కేంద్రం కీలక నిర్ణయం

భారత్‌-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత రక్షణ దళాలకు ఊతం ఇచ్చేలా

Updated : 21 Jun 2020 19:08 IST

న్యూదిల్లీ: భారత్‌-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత రక్షణ దళాలకు ప్రత్యేక ఆర్థికశక్తిని ఇచ్చింది. రూ.500 కోట్లలోపు అత్యాధునిక యుద్ధ సామాగ్రిని కొనుగోలు చేసుకునేందుకు వీలుగా త్రివిధ దళాలకు అధికారం ఇచ్చింది.

‘‘త్రివిధ దళాలకు ఆర్థికశక్తిని అందించే కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం అత్యవసరాల నిమిత్తం రూ.500కోట్లలోపు ఆయుధాలను కొనుగోలు చేయడం, లేదా అప్‌గ్రేడ్‌ చేసుకునేలా ప్రత్యేక అధికారాలను ఇచ్చింది. దీని ద్వారా నూతన, అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేసే వీలు కలుగుతుంది’’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నిధుల ద్వారా ఆర్మీ సరికొత్త ఆయుధాలను సమకూర్చుకోనుంది. త్రివిధ దళాలు ఇప్పటికే ఎలాంటి ఆయుధాలను కొనుగోలు చేయాలన్న దానిపై కసరత్తు ప్రారంభించాయి. ఆయుధాల జాబితాను సిద్ధం చేసుకొంటున్నాయి. 

సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తాజాగా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ భేటీకి త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం.నరవణె, నావికాదళాధిపతి అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌, వాయుసేనాధిపతి చీఫ్‌ మార్షల్‌ ఆర్‌.కె.ఎస్‌ భదౌరియా హాజరయ్యారు. చైనా సైన్యం దుస్సాహసాలకు గట్టిగా బదులివ్వడానికి సిద్ధంగా ఉండాలని భారత సైన్యానికి రాజ్‌నాథ్‌ సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని