భారత అంతరిక్ష రంగంలో కీలక మలుపు

భారత అంతరిక్ష రంగంలో ఓ నూతన అధ్యాయానికి తెర లేచింది.

Published : 25 Jun 2020 14:48 IST

అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు భాగస్వామ్యం

దిల్లీ: భారత అంతరిక్ష రంగంలో ఓ నూతన అధ్యాయానికి తెర లేచింది. దేశ అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు భాగస్వామ్యానికి ప్రభుత్వ అనుమతి లభించింది. ఇకపై రాకెట్లు, ఉపగ్రహాల నిర్మాణం, వాటి ప్రయోగం, గ్రహాంతర యాత్రలతో సహా అన్ని రకాల అంతరిక్ష కార్యక్రమాల్లోనూ ప్రైవేటు సంస్థలు పాల్గొనవచ్చని ఇస్రో అధ్యక్షులు కె.శివన్‌ నేడు ప్రకటించారు. దేశంలో ప్రైవేటు అంతరిక్ష వ్యవహారాల పర్యవేక్షణకు ‘‘ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌’’ (ఇన్‌ స్పేస్‌) అనే నూతన సంస్థ ఏర్పాటును కేంద్ర క్యాబినెట్‌ మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. ఈ సంస్థ ఇస్రోకు - ప్రైవేటు అంతరిక్ష కార్యకలాపాల్లో పాలుపంచుకోవాలనుకునే వ్యక్తులు, సంస్థలకు మధ్య వారధిగా వ్యవహరించనుంది.

‘‘భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ఈ నిర్ణయంతో మన అంతరిక్ష విజ్ఞానాన్ని దేశాభివృద్ధికి ఉపయోగించుకోగలిగే సామర్థ్య మరింతగా పెరుగుతుంది. మన అంతరిక్ష రంగం త్వరిత గతిన అభివృద్ధి చెందటమే కాకుండా.. అంతరిక్ష ఆర్థిక వ్యవహారాల్లో భారత్‌ అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషించేందుకు వీలవుతుంది’’ అని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ వివరించారు. కాగా, భారత ప్రభుత్వ అంతరిక్ష సంస్థ ఇస్రో కార్యకలాపాల్లో ఏ మార్పులు ఉండవని ... అత్యాధునిక పరిశోధనలు, గ్రహాంతర యాత్రలు, మానవ సహిత అంతరిక్ష యాత్రలు వంటివి యథావిధిగా నిర్వహిస్తామని డాక్టర్‌ శివన్‌ స్పష్టం చేశారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని