పాకిస్థాన్ విమానాల‌ను నిషేధించిన యూర‌ప్!

పాకిస్థాన్ అంత‌ర్జాతీయ విమానయాన సంస్థ‌‌పై ఆరు నెల‌ల‌పాటు నిషేధం విధిస్తున్న‌ట్లు యురోపియ‌న్ యూనియ‌న్ వెల్ల‌డించింది. పాకిస్థాన్లో ఎక్కువ‌శాతం పైలట్లు న‌కిలీ లైసెన్సులు క‌లిగిఉన్నార‌ని తేల‌డంతో ప‌లు పాక్‌ విమాన‌యాన సంస్థ‌ల‌పై నిషేధిస్తున్న‌ట్లు తెలిపింది.

Updated : 21 Dec 2022 17:07 IST

దేశంలో స‌గానికిపైగా పైల‌ట్ లైసెన్సులు న‌కిలీవే.!

దిల్లీ: పాకిస్థాన్ అంత‌ర్జాతీయ విమానయాన సంస్థ‌‌పై ఆరు నెల‌ల‌పాటు నిషేధం విధిస్తున్న‌ట్లు యురోపియ‌న్ యూనియ‌న్ వెల్ల‌డించింది. పాకిస్థాన్లో ఎక్కువ‌శాతం పైలట్లు న‌కిలీ లైసెన్సులు క‌లిగిఉన్నార‌ని తేల‌డంతో ప‌లు పాక్‌ విమాన‌యాన సంస్థ‌ల‌పై నిషేధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

మూడోవంతు లైసెన్సులు న‌కిలీవే..?

పాకిస్థాన్‌లో ఇప్ప‌టివ‌ర‌కు జారీయైన‌ పైలట్ లైసెన్సుల్లో ఎక్కువ‌శాతం చెల్లనివ‌ని తాజాగా విడుద‌లైన‌ ప్ర‌భుత్వ నివేదిక స్ప‌ష్టం చేసింది. దేశంలో 860 క్రియాశీల పైల‌ట్ లైసెన్సులుండ‌గా వీటిలో దాదాపు 262 లైసెన్సులు సందేహాస్ప‌దంగా ఉన్నాయ‌ని వెల్ల‌డించింది. దీనిపై పాకిస్థాన్ పార్ల‌మెంటులోనూ చ‌ర్చ జ‌రిగింది. కేవ‌లం పాకిస్థాన్ అంత‌ర్జాతీయ‌ విమాన‌యాన సంస్థ(పీఐఏ)లోనే‌ మూడోవంతు పైలట్లు త‌ప్పుడు విధానంలో లైసెన్సులు పొందిన‌ట్లు విచార‌ణ‌లో తేలింది. పీఐఏలో దాదాపు 434మంది పైలట్లు ఉండ‌గా, వీరిలో 141 లైసెన్సుల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు పాకిస్థాన్ విమాన‌యానశాఖ మంత్రి ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలోనే పీఐఏ‌తోపాటు ప‌లు పాకిస్థాన్ విమానయాన సంస్థల‌పై 6నెల‌ల పాటు తాత్కాలిక‌ నిషేధం విధిస్తున్న‌ట్లు ఈయూ తెలిపింది. జులై 1నుంచి ఈ నిషేధం అమలులో ఉండ‌నున్న‌ట్లు పేర్కొంది.

ఈయూ నిర్ణ‌యంతో యూర‌ప్‌కు త‌మ విమాన స‌ర్వీసుల‌ను నిలిపివేస్తున్న‌ట్లు పీఐఏ ప్ర‌క‌టించింది. పీఐఏలో పనిచేస్తున్న పైలట్లంద‌రికీ స‌రైన అర్హత ఉందా?అనే అనుమానాన్ని యురోపియ‌న్ యూనియ‌న్ ఏవియేష‌న్ సేఫ్టీ ఏజెన్సీ(ఈఏఎస్ఏ) వ్య‌క్తం చేసిన‌ట్లు పీఐఏ అధికార ప్ర‌తినిధి వెల్ల‌డించారు. పీఐఏ పైలట్లంద‌రూ విశ్వాసాన్ని కోల్పోయిన‌ట్లు అభిప్రాయ‌పడ్డారు.

అయితే, మే నెల‌లో పీఐఏ విమానం కుప్ప‌కూలి 97మంది మృత్యువాత ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ దుర్ఘ‌ట‌న‌కు పైల‌ట్ల నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌ని ద‌ర్యాప్తులో తేలింది. విమానం లాండింగ్ స‌మ‌యంలో తొలుత‌ చ‌క్రాల‌ను దించ‌కుండానే లాండ్ చేయ‌డానికి పైల‌ట్లు ప్ర‌య‌త్నించిన‌ట్లు ద‌ర్యాప్తు అధికారులు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో పైల‌ట్లు క‌రోనా వైర‌స్ గురించి చ‌ర్చిస్తున్న‌ట్లు ద‌ర్యాప్తు అధికారులు గుర్తించారు.

గ‌త ‌కొంతకాలంగా పాకిస్థాన్ పైల‌ట్ల తీరుపై అంత‌ర్జాతీయంగా చ‌ర్చ జరు‌గుతోంది. అంతేకాదు, ఐక్య‌రాజ్య స‌మితి కూడా త‌మ సిబ్బందిని పీఐఏ విమానాల్లో ప్ర‌యాణించ‌కూడ‌ద‌ని హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని