రెండు వారాల్లో కరోనా ఔషధ ప్రయోగ ఫలితాలు

కొవిడ్‌-19ను నయం చేసే ఔషధాలపై జరుగుతున్న ప్రయోగ ఫలితాలు మరో రెండు వారాల్లో రానున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 39 దేశాల్లో 5,500 మందిపై ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నట్లు తెలిపారు...........

Updated : 04 Jul 2020 15:14 IST

వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

జెనీవా: కొవిడ్‌-19ను నయం చేసే ఔషధాలపై జరుగుతున్న ప్రయోగ ఫలితాలు మరో రెండు వారాల్లో రానున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 39 దేశాల్లో 5,500 మందిపై ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నట్లు తెలిపారు. ఇటు భారత్‌తో పాటు ప్రపంచ దేశాల్లో వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న తరుణంలో డబ్ల్యూహెచ్‌వో తాజా ప్రకటన ఆశలు రేకెత్తిస్తోంది. 

ప్రస్తుతం రెమ్‌డెసివిర్‌; యాంటీ మలేరియా డ్రగ్‌ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌(హెచ్‌సీక్యూ); హెచ్‌ఐవీ ఔషధాలు లోపినావిర్‌/రిటోనావిర్‌; ఇంటర్‌ఫెరాన్‌తో కలిపి లోపినావిర్‌/రిటోనావిర్‌ ఔషధాల్ని మనుషులపై ప్రయోగించి పరిశీలిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అలాగే వీటిని ఇచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలను సైతం గమనిస్తున్నట్లు పేర్కొన్నారు. గత నెల హెచ్‌సీక్యూ క్లినికల్‌ ట్రయల్స్‌ని నిలిపివేస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించిన విషయం తెలిసిందే. వ్యాధి సోకిన వారిలో ఇది పెద్దగా ప్రభావం చూపడం లేదన్న వివిధ అధ్యయనాల నేపథ్యంలోనే సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ.. వైరస్‌ సోకకుండా ముందు జాగ్రత్తగా దీన్ని వినియోగించవచ్చా అనే కోణంలో ప్రయోగాలు నిర్వహిస్తున్నారు.

ఇక కరోనా వ్యాక్సిన్‌ ఎప్పటికి వస్తుందో ఇప్పుడే అంచనా వేయడం తెలివితక్కువ పని అవుతుందని డబ్ల్యూహెచ్‌వో అత్యవసర కార్యక్రమాల విభాగాధిపతి మైక్‌ ర్యాన్‌ అభిప్రాయపడ్డారు. మనుషులపై వ్యాక్సిన్‌ ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ ఏడాది చివరికి తెలిసే అవకాశం ఉన్నప్పటికీ.. ఎప్పటి వరకు దాన్ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయగలమన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 18 వ్యాక్సిన్లు మానవ ప్రయోగాల దశకు చేరుకున్నాయని తెలిపారు. ఆగస్టు 15 నాటికి కొవాగ్జిన్‌ అనే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చే దిశగా భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) చర్యల్ని వేగవంతం చేస్తున్న తరుణంలో ర్యాన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

అలాగే కరోనా గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో డబ్ల్యూహెచ్‌వో పాత్రను ర్యాన్‌ మరోసారి సమర్థించుకున్నారు. వైరస్‌కు సంబంధించిన సమాచారం వెలుగులోకి వస్తున్న కొద్దీ అందుకనుగుణంగా తీసుకోవాల్సిన అన్ని చర్యల్ని సంస్థ తీసుకుందని వివరించారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసుల్లో ఇబ్బందులు తలెత్తడంతో వైద్య సిబ్బందికి కావాల్సిన పరికరాల అందజేతలో జాప్యం జరిగిందని.. ఇదొక్కటే సంస్థ విచారిస్తున్న అంశమని తెలిపారు. దీని వల్ల కొంతమంది వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం తమకు తీవ్ర ఆవేదనను కలిగించిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు