నిజమైన సంతోషం అంటే ఇదే: మహీంద్రా

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుగ్గా ఉంటూ సమాజంలో జరిగే విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు....

Published : 06 Jul 2020 18:03 IST

దిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుగ్గా ఉంటూ సమకాలీన విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. అలా ఆయన ఆవిష్కరణల నుంచి స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల జీవనవిధానం వరకు ప్రతి ఆసక్తికర అంశాలను తన ట్విటర్‌ ఖాతా ద్వారా షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన ఒక వీడియో షేర్‌ చేస్తూ జీవితంలో చిన్న చిన్న సరదాలు ఎంతో ఆనందాన్ని ఇస్తాయని పేర్కొన్నారు.

ఈ వీడియోలో కొంతమంది పిల్లలు గ్రామంలోని చెరువు దగ్గర ఆడుకుంటుంటారు. దానిలో భాగంగా వారంతా దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి రోలర్ కోస్టర్‌ తరహాలో మట్టిలో జారుకుంటూ నీటిలో పడిపోతుంటారు. 22 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోని నాంది ఫౌండేషన్ సీఈవో మనోజ్‌ కుమార్ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ ‘‘సంతోషం అంటే ఇదే, ఇలాంటి సంతోషాన్ని భారతీయ గ్రామాలు మాత్రమే ఇవ్వగలవు. వెళ్లి చూడండి’’  అని కామెంట్ జోడించారు.

ఇదే వీడియోని ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేస్తూ ‘‘ ఈ వీడియోలో ఎంతో విషయం దాగుంది. కరోనా తర్వాత ప్రపంచం మొత్తం నిరాడంబరమైన జీవితం గడపటానికి ప్రాధాన్యం ఇస్తుంది. నా వర్చువల్ ఆఫీస్‌లోకి వెళ్లి పనిచేయడానికి ఇది నాకు సోమవారం నాడు ప్రోత్సాహాన్ని (మండే మోటివేషన్) ఇస్తుంది’’  అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోని సుమారు లక్షన్నర మందికి పైగా వీక్షించారు. ‘అలానే వారి చర్యలు ఎంతో స్ఫూర్తిదాయకం’, ‘పిల్లలు ఇటువంటి విషయాల్లో తమ ఆనందాన్ని  వెతుక్కుంటారు.. ఎందుకంటే వారు అటువంటి వాటి కోసం ప్రత్యేకంగా వెతుకుతారు కాబట్టి’ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని