చైనా సరిహద్దుల్లో నిర్మాణాలు పూర్తి చేయండి: రాజ్‌నాథ్‌

చైనా సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల నిర్మాణం మరింత వేగవంతం చేయాలని భారత్ నిర్ణయించింది. గల్వాన్‌ లోయలో రెండు దేశాల సైనికులు వెనక్కి వెళ్లినప్పటికీ నిర్మాణాల్లో అలసత్వం ప్రదర్శించకూడదని భావిస్తోంది.....

Updated : 07 Jul 2020 19:17 IST

సరిహద్దుల్లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించిన రాజ్‌నాథ్‌ సింగ్‌

ముంబయి: చైనా సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల నిర్మాణం మరింత వేగవంతం చేయాలని భారత్ నిర్ణయించింది. గల్వాన్‌ లోయలో రెండు దేశాల సైనికులు వెనక్కి వెళ్లినప్పటికీ నిర్మాణాల్లో అలసత్వం ప్రదర్శించకూడదని భావిస్తోంది. గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. చైనావైపు 40-45 మంది హతమయ్యారని తెలిసింది. ఆ తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరగడంతో రెండు దేశాలూ సైనికులు, ఆయుధాలను మోహరించాయి. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ రంగంలోకి దిగిన తర్వాత చైనీయులు వెనక్కి తగ్గారు. ప్రస్తుతానికి పరిస్థితులు శాంతించినట్టు కనిపించినా చైనా కుయుక్తుల గురించి తెలిసిన భారత్‌ మౌలిక సదుపాయాల నిర్మాణాలు వేగిరం చేయాలనే నిర్ణయించుకుంది.

సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మంగళవారం సమీక్షించారని తెలిసింది. సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్‌వో) డైరెక్టర్‌ జనరల్‌, లెఫ్టినెంట్‌ జనరల్‌ హర్పల్‌ సింగ్‌ నిర్మాణాల వివరాలను మంత్రికి వివరించారు. వాస్తవాధీన రేఖ సమీపంలోని 30కి పైగా రహదారుల నిర్మాణాలపై రక్షణ మంత్రిత్వ శాఖ గత నెల్లో  సమీక్షించడం తెలిసిందే. చైనా నుంచి అభ్యంతరాలు వస్తున్నా సరే రహదారులను పూర్తి చేయాలని ఆదేశించింది. లద్దాఖ్‌ మాత్రమే కాకుండా అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం, ఉత్తరాఖండ్‌లోని ప్రాజెక్టలనూ మంత్రి సమీక్షించారు.నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి సరిహద్దుల్లో నిర్మాణాల బడ్జెన్‌ను కేంద్రం పెంచింది. ఇప్పుడు రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాలను వేగవంతం చేయబోతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని