‘‘లద్దాఖ్‌లో ఎలాంటి సవాళ్లకయినా సిద్ధం’’

భారత్-చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు భారత్...

Updated : 07 Jul 2020 21:07 IST

భారతీయ వాయుసేన

లద్దాఖ్‌: భారత్-చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇప్పటికే చైనా బలగాలు వివాదాస్పద ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా కుయుక్తులను దృష్టిలో ఉంచుకొని భారత్ ఆచితూచి అడుగులేస్తోంది. ఈ మేరకు లద్దాఖ్‌ ప్రాంతంలో భారత్ వాయుసేన రాత్రి పగలుతో పాటు ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా యుద్ధ సన్నద్ధతపై అంచనా వేస్తోంది. ఇందులో భాగంగా వాయుసేనకు చెందిన ఫైటర్‌ జెట్‌లు, యుద్ధ హెలికాఫ్టర్లు, మల్టీ మిషన్ చాపర్లు వంటి వాటిని అక్కడి ఎయిర్‌బేస్‌ నుంచి  రాత్రి సమయాల్లో కూడా ఆపరేషన్లు చేపట్టేందుకు సిద్ధంగా ఉంచినట్లు  సంబంధిత వర్గాలు తెలిపాయి.

భారతీయ వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన మిగ్-29 ఫైటర్‌ జెట్లు, సుఖోయ్‌-30ఎస్‌ విమానాలు, అపాచీ ఏహెచ్‌-64ఈ యుద్ధ హెలికాఫ్టర్లు, సీహెచ్‌-47ఎఫ్ (ఐ) చినూక్‌ మల్టీ మిషన్ హెలికాఫ్టర్లు వంటి వాటిని లద్దాఖ్ పర్వతశ్రేణుల్లో  వాయుసేన మోహరించింది. దీని ద్వారా భారత్‌కు తగిన సామర్ధ్యం ఉందని, అవసరమైనప్పుడు  బదులిచ్చే సత్తా తమకుందనే సందేశాన్ని డ్రాగన్ దేశానికి పంపడం దీని ముఖ్య ఉద్దేశం అని పలువురు రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  ‘‘గతంలో పర్వత ప్రాంతాల్లో రాత్రిపూట గస్తీకి కొన్ని పరిమితులు ఉండేవి. ప్రస్తుతం వాటన్నింటినీ అధిగమించాం. లద్దాఖ్‌లో రాత్రిపూట వాయుసేన కార్యకలాపాలు చేపట్టడం ఐఏఎఫ్ శిక్షణలో భాగం. దీని ద్వారా పైలెట్లు, ఇతర సిబ్బంది నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు’’ అని మాజీ ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ మన్మోహన్‌ బహదూర్‌ తెలిపారు.

ఇరు దేశాల ముఖ్య నాయకుల మధ్య జరిగిన ఒప్పందం మేరకు చైనా తన బలగాలను వెనక్కు పిలిచిన నేపథ్యంలో భారత్ సైన్యం సరిహద్దు గస్తీని మరింత మెరుగుపరిచి అప్రమత్తంగా ఉంది. ఒక వేళ   చైనా మరోసారి దుందుడుకు చర్యలకు దిగితే దీటుగా బదులిచ్చేందుకే లద్దాఖ్​లోని ఎయిర్​బేస్​లు హైఅలర్ట్‌​లో ఉన్నాయని మరో అధికారి వెల్లడించారు. గల్వాన్​ ఘటన తర్వాత సైనికులను లద్దాఖ్‌కు తరలించడంలో వాయుసేనకు చెందిన సీ-17 గ్లోబ్​ మాస్టర్ 3, సీ130జే సూపర్​ హెర్క్యూలిస్​ విమానాలు కీలకపాత్ర పోషించాయని సదరు అధికారి తెలిపారు. ఇప్పటికే ఐఏఎఫ్ అవసరాలకు అనుగుణంగా అపాచీ, చినూక్‌ మల్టీ మిషన్ హెలికాఫ్టర్లలో మార్పులు చేశారు. దానితో పాటు రూ.38,900 కోట్లతో 33 కొత్త యుద్ధ విమానాల కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని