వైరస్‌ కట్టడికి సరికొత్త ఎయిర్‌ఫిల్టర్‌

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కలవరపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి ధాటికి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు....

Published : 08 Jul 2020 23:44 IST

రూపొందించిన హ్యూస్టన్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు

హ్యూస్టన్‌: ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కలవరపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి ధాటికి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీని కట్టడికి శాస్త్రవేత్తలు సైతం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే పలు ఔషధ సంస్థలు ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసి క్లినికల్ ట్రయల్స్‌ కూడా ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ‘‘క్యాచ్‌ అండ కిల్‌’’ అనే ఎయిర్‌ ఫిల్టర్‌ను హ్యూస్టన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది వైరస్‌ను గుర్తించిన వెంటనే నాశనం చేస్తుందని మెటీరియల్స్ టుడే ఫిజిక్స్‌ అనే జర్నల్ తన కథనంలో పేర్కొంది.

ఈ సరికొత్త పరికరం సాయంతో  విద్యాసంస్థలు, ఆస్పత్రులు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, విమానాశ్రయాలుతో పాటు ఇతర ప్రజా రవాణా ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తిని నివారించవచ్చని తెలిపారు. ఒక్క సారి ఫిల్టర్‌ చేయడంతో దాదాపు 99.8 శాతం కరోనా వైరస్‌ను నాశనం అవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వాణిజ్య అవసరాలకు లభించే నికెల్ నురుగు సహాయంతో ఈ పరికరాన్ని రూపొందించినట్లు తెలిపారు. అలానే దీని సహాయంతో ఆంత్రాక్స్‌ వ్యాధికి కారణమయ్యే బాసిల్లస్ ఆంత్రాక్స్ అనే బాక్టీరియా 99.9 శాతం నాశనం అయినట్లు కథనంలో వెల్లడించారు.

‘‘కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు విమానాశ్రయాలు, కార్యాలయాలు, పాఠశాలలు, క్రూయిజ్‌ షిప్‌లలో ఈ ఫిల్టర్‌ను ఏర్పాటు చేయవచ్చు. ఇది సమాజానికి ఎంతో ఉపయోగకరమైంది’’ అని పరిశోధకుల్లో ఒకరైన, హ్యూస్టన్‌ విశ్వవిద్యాలయం అధ్యాపకుడు జిఫెంగ్‌ రెన్‌ అన్నారు. కార్యాలయాల్లో ఉద్యోగులు విడిచే గాలిని తక్షణం శుభ్రపరిచేందుకు డెస్క్‌ టాప్ మోడల్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

శాస్త్రవేత్తల అంచనా ప్రకారం వైరస్‌ సుమారు మూడు గంటల పాటు గాలిలో ఉండగలదు. అలానే ఇది 70 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను తట్టుకోలేదని, ఫిల్టర్‌ ఉష్ణోగ్రతను 200 డిగ్రీల సెల్సియస్‌కు పెంచడం ద్వారా వైరస్‌ను వెంటనే నాశనం చేయవచ్చని పరిశోధకులు కథనంలో పేర్కొన్నారు.  వ్యాపార సముదాయాలు, ఇతర పని ప్రదేశాల్లో వైరస్‌ వెంటనే తొలగించకపోతే సాధారణ కార్యకలాపాలు పునఃప్రారంభించడం సాధ్యం కాదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే తొలి దశలో భాగంగా  ఈ ఫిల్టర్లను విద్యాసంస్థలు, ఆస్పత్రులు, విమానాలు, కార్యాలయాలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, ఇతర ప్రయాణ ప్రదేశాలు వంటి చోట్ల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని