#MeToo ఆరోప‌ణ‌లు: సియోల్ మేయ‌ర్ ఆత్మ‌హ‌త్య‌!

ద‌క్షిణ కొరియా అధ్య‌క్షుడి రేసులోఉన్న వ్య‌క్తి, సియోల్ న‌గ‌ర మేయ‌ర్ పార్క్‌-వోన్‌-సూన్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. త‌న‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు వ‌చ్చిన మ‌రుస‌టిరోజే పార్క్ త‌నువు చాలించాడు. న‌గ‌రంలోన ఓ ప‌ర్వ‌త ప్రాంతంలో పార్క్ మృత‌దేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంత‌రం మేయ‌ర్ అధాకారిక‌ నివాసంలో ల‌భ్య‌మైన‌ సూసైడ్ నోట్‌ను అధికారులు విడుద‌ల చేశారు.

Published : 11 Jul 2020 00:11 IST

లైంగికంగా వేధిస్తున్నాడంటూ మాజీ కార్య‌ద‌ర్శి ఫిర్యాదు
తనను క్ష‌మించండంటూ మేయ‌ర్‌ సూసైడ్ నోట్‌

సియోల్‌: ద‌క్షిణ కొరియా అధ్య‌క్షుడి రేసులోఉన్న వ్య‌క్తి, సియోల్ న‌గ‌ర మేయ‌ర్ పార్క్‌-వోన్‌-సూన్ (64) ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. త‌న‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు వ‌చ్చిన మ‌రుస‌టిరోజే పార్క్ త‌నువు చాలించారు. న‌గ‌రంలోన ఓ ప‌ర్వ‌త ప్రాంతంలో పార్క్ మృత‌దేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంత‌రం మేయ‌ర్ అధాకారిక‌ నివాసంలో ల‌భ్య‌మైన‌ సూసైడ్ నోట్‌ను అధికారులు విడుద‌ల చేశారు. 

‘ప్ర‌తి ఒక్కరూ న‌న్ను క్ష‌మించండి. నా సుదీర్ఘ జీవితకాలంలో నాతో పాటు ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నా. అత్యంత బాధ క‌లిగించినందుకు నా కుటుంబస‌భ్యులు కూడా న‌న్ను క్ష‌మించండి' అని సూసైడ్ నోట్‌‌లో పార్క్ పేర్కొన్నాడు. అయితే, త‌న‌పై వ‌చ్చిన‌ ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి ఎలాంటి విష‌యాల‌నూ నోట్‌‌లో మేయ‌ర్ ప్ర‌స్తావించ‌లేదు.

సియోల్‌ మేయ‌ర్ త‌న‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డార‌ని ఆరోపిస్తూ మాజీ కార్య‌ద‌ర్శి ఒక‌రు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కార్యాల‌య స‌మ‌యంలోనే త‌న‌తో అనుచితంగా ప్ర‌వ‌ర్తించేవాడ‌ని, 2015 నుంచి మేయ‌ర్‌కు వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన‌ మ‌హిళ త‌న ఫిర్యాదులో పేర్కొంది. దీంతో మేయ‌ర్ పార్క్‌పై కేసు న‌మోదైంది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా మీటూ (#MeToo) ఉద్య‌మంలో భాగంగా లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఎంతోమంది మ‌హిళ‌లు స్వ‌యంగా వారి అనుభ‌వాల‌ను తెలుపుతున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా ప‌లుకుబ‌డి, ఉన్న‌తస్థానంలో ఉన్న‌వారు ఎంద‌రో ఇలాంటి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఘ‌ట‌న‌లు బ‌య‌ట‌కు వ‌స్తూనే ఉన్నాయి. దీనిలో భాగంగా ద‌క్షిణ కొరియాలోనూ గ‌త‌ రెండు సంవ‌త్స‌రాలుగా మీటూ (#MeToo) ఉద్య‌మం ఊపందుకుంది. ఇప్ప‌టికే  లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు రుజువుకావ‌డంతో ఓ గ‌వ‌ర్న‌ర్ స్థాయి వ్య‌క్తి జైలుకు వెళ్లాల్సి వ‌చ్చింది.

ద‌క్షిణ కొరియాలో ప్ర‌స్తుతం అధికారపార్టీలో కీల‌క నాయ‌కుల్లో పార్క్ ఒక‌రు. దేశంలోనే అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన సియోల్‌ న‌గరానికి గ‌డిచిన‌ ద‌శాబ్దం నుంచి పార్క్‌-వోన్‌-సూన్ మేయ‌ర్‌గా సేవ‌లందిస్తున్నారు. లింగ స‌మాన‌త్వం, సామాజిక స‌మాన‌త్వాన్ని ప్రోత్స‌హించే పార్క్ గ‌త మూడు ఎన్నిక‌ల్లోనూ గెలుపొందారు. అంతేకాకుండా 2022లో జ‌రిగే దేశాధ్య‌క్షుడి రేసులో కూడా ఉన్నారు. మాన‌వ హ‌క్కుల న్యాయ‌వాదిగా పేరుగాంచిన పార్క్.. విద్యార్థి సంఘం నాయ‌కుడిగా త‌న ప్ర‌స్థానాన్ని మొద‌లుపెట్టాడు. అయితే, పార్క్ ఆత్మ‌హ‌త్య‌పై దేశ‌వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. శిక్ష నుంచి త‌ప్పించుకోవడానికే పార్క్ ఇలా చేశార‌ని కొంద‌రు విమ‌ర్శిస్తే.. మేయ‌ర్ పార్క్‌ ఒక అద్బుత‌మైన రాజ‌కీయ నాయ‌కుడంటూ అక్క‌డి కొన్ని ప‌త్రిక‌లు, మ‌ద్ద‌తుదారులు కీర్తించ‌డం గ‌మ‌నార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని