నాయకత్వం కోసం అమెరికా తపిస్తోంది :కమలా హారిస్‌

నాయకత్వం కోసం అమెరికా తపిస్తోందని ఆ దేశ ఉపాధ్యక్ష స్థానానికి డెమోక్రటిక్‌ పార్టీ తరఫున పోటీచేసేందుకు ఎంపికైన కమలా హారిస్‌ విమర్శించారు...

Published : 14 Aug 2020 10:53 IST

వాషింగ్టన్‌: నాయకత్వం కోసం అమెరికా తపిస్తోందని ఆ దేశ ఉపాధ్యక్ష స్థానానికి డెమోక్రటిక్‌ పార్టీ తరఫున పోటీచేసేందుకు ఎంపికైన కమలా హారిస్‌ విమర్శించారు. డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌.. కమలాను ఉపాధ్యక్ష పదవికి పోటీపడేందుకు ఎంపికచేసినట్లు మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో బైడెన్, హారిస్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హారిస్‌ మాట్లాడుతూ.. కొవిడ్‌-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన తప్పిదాల కారణంగా అమెరికన్లు మహా మాంద్యం (గ్రేట్‌ డిప్రెషన్‌) నాటి ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో కూరుకుపోయారని విమర్శించారు. మరోవైపు, కమలా హారిస్‌ పేరు ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించిన 24 గంటల్లోనే బైడెన్‌ సుమారు రూ.194.53 కోట్ల (2.6 కోట్ల డాలర్లు) ఎన్నికల నిధులు సమీకరించగలిగారు. కమలా ఎంపిక పట్ల అమెరికాలోని భారతీయ ముస్లింలు, సిక్కులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ముస్లిమ్స్‌ అమెరికా (ఏఐఎం), సిక్కు కౌన్సిల్‌ ఆన్‌ రిలీజియన్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌లు వేర్వేరుగా ప్రకటనలు విడుదలచేశాయి. 

అది అసాధారణ నిర్ణయం: ట్రంప్‌
ఉపాధ్యక్ష స్థానానికి పోటీపడే అభ్యర్థిగా కమలా హారిస్‌ని బైడెన్‌ ఎంపిక చేయడం అసాధారణ, ముప్పుతో కూడిన నిర్ణయమని అధ్యక్షుడు ట్రంప్‌ అభివర్ణించారు. ఈ మేరకు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘చూడండి ఆయన ఓ నిర్ణయం ప్రకటించారు.  బైడెన్‌ను హారిస్‌ కంటే ఎక్కువగా విమర్శించినవారు లేరు. ఆయన గురించి భయంకరమైన విషయాలను ఆమె వెల్లడించారు’’ అని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు