Vaccine: వారికి టీకాలు వేయకుంటే అంతరించి పోతారు

అసలే అంతరించే ముప్పు ముంగిట ఉన్న గిరిజన తెగలు...

Published : 05 Jun 2021 14:21 IST

 60 రోజుల్లో ఆ తెగల్లో వేయండి
రాష్ట్రాలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ సిఫార్సు

ఈనాడు, దిల్లీ: అసలే అంతరించే ముప్పు ముంగిట ఉన్న గిరిజన తెగలు... కరోనాతో కనుమరుగయ్యే ప్రమాదముందని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆందోళన వ్యక్తం చేసింది. వీరిలో 50 వేల లోపు జనాభా ఉన్న తెగల్లోని వారందరికీ 60 రోజుల్లో కొవిడ్‌ టీకాలు వేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సిఫార్సు చేసింది. దేశంలోని 177 గిరిజన జిల్లాల్లో 705 గిరిజన తెగలు ఉండగా అందులో లక్షలోపు జనాభాతో 75 తెగలు అంతరించే ముప్పును ఎదుర్కొంటున్నాయని గుర్తుచేసింది. ఈ తెగల్లో కరోనా మరింతగా వ్యాపిస్తే వాటి మనుగడే ప్రశ్నార్థకమవుతుందంటూ.. రక్షణకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ పలు సూచనలు చేసింది. ‘‘ఆయా తెగల నివాసాల వద్దకు వెళ్లి తరచూ ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించాలి. సంచార బృందాలను పంపి 50 వేల లోపు ఉన్న తెగల్లోని వారందరికీ 60 రోజుల్లోపు వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలి. వారికి కొవిడ్‌ మెడికల్‌ కిట్లు అందజేయాలి. ఆ తెగల సమీపంలోని వారికి కరోనాపై స్థానిక భాషల్లో అవగాహన కల్పించాలి. మెడికల్‌ కిట్లు అందించే క్రమంలో ఇతరుల నుంచి కరోనా వ్యాప్తి చెందకుండా డ్రోన్లను వినియోగించాలి. ఆ తెగల నివాస ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలి. వారు నివసిస్తున్న ప్రాంతాలకు దగ్గరలో ప్రత్యేకంగా వైద్యులు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. ఆయా తెగల నివాస ప్రాంతాల్లోకి ఇతరుల రాకపోకలు లేకుండా కఠినమైన ఆంక్షలు అమలు చేయాలి. మహమ్మారి తీవ్రతపై ఆయా తెగల పెద్దలు, వారిలో అక్షరాస్యత కలిగిన వారికి, వారి దగ్గరకు వెళ్లే వాలంటీర్లు, ఆశా కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులకు అవగాహన కల్పించాలి. ఇళ్ల వద్దకు రేషన్, ఆహార బుట్టలు పంపించాలి. వారికి నెలవారీ అందే పింఛన్లు, ఇతర నగదును నేరుగా వారికే అందేలా చూడాలి. వారికోసం 24 గంటలు పని చేసేలా జిల్లా కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలి. వీటి అమలుకు జిల్లాల కలెక్టర్లను నోడల్‌ అధికారులుగా నియమించాలి’’ అని ఎన్‌హెచ్‌ఆర్‌సీ సూచించింది. ఈ సిఫార్సుల అమలుపై నాలుగు వారాల్లో తమకు నివేదిక ఇవ్వాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖను ఆదేశించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని