Corona: ప్రధాన విలన్‌ డెల్టానే

టీకా పొందాక కూడా కొందరు కొవిడ్‌-19 బారినపడటానికి ప్రధాన కారణం డెల్టా రకం కరోనా వైరస్సేనని

Updated : 17 Jul 2021 09:35 IST

టీకా పొందాకా.. కరోనా సోకడానికి ఇదే కారణం 
తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించిన వ్యాక్సిన్లు
ఐసీఎంఆర్‌ అధ్యయనంలో వెల్లడి 

దిల్లీ: టీకా పొందాక కూడా కొందరు కొవిడ్‌-19 బారినపడటానికి ప్రధాన కారణం డెల్టా రకం కరోనా వైరస్సేనని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఇలాంటివారిలో 9.8 శాతం మంది మాత్రమే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని, 0.4 శాతం కేసుల్లోనే మరణం సంభవించిందని తేలింది. దీన్నిబట్టి ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరాన్ని, మరణాలను టీకాలు తప్పిస్తున్నాయని అధ్యయనం స్పష్టంచేసింది. వ్యాక్సినేషన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడం ద్వారా కొవిడ్‌ తదుపరి ఉద్ధృతుల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని పేర్కొంది.  వ్యాక్సిన్‌ అనంతర ఇన్‌ఫెక్షన్లపై దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో నిర్వహించిన తొలి అధ్యయనం ఇదే. ఇందులో టీకాలు పొందినప్పటికీ కొవిడ్‌ పాజిటివ్‌గా తేలిన 677 మందికి చెందిన స్వాబ్‌ నమూనాలను విశ్లేషించారు. 17 రాష్ట్రాల నుంచి వీటిని తీసుకున్నారు. 

* మొత్తం 677 మందిలో 86.09 శాతం మంది డెల్టా వేరియంట్‌ బారినపడ్డారు. ఈ రకం వైరస్‌.. మార్చి-జూన్‌ నెలలో సామాజిక వ్యాప్తి స్థాయిలో సంక్రమించింది. ఆల్ఫా, కప్పా వేరియంట్లు ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. 

* 67 మంది (9.8 శాతం) ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఎదురైంది. ముగ్గురు (0.4 శాతం మంది) చనిపోయారు. 

* భారత దక్షిణ, పశ్చిమ, తూర్పు, వాయవ్య ప్రాంతాల్లో ప్రధానంగా డెల్టా, ఆ తర్వాత కప్పా వేరియంట్లు ఉన్నాయి. 

* 677 మందిలో 85 మందికి మొదటి డోసు టీకా తీసుకున్నాక కొవిడ్‌ సోకింది. 592 మందికి రెండు డోసులు పొందాక వచ్చింది. 

* ఈ కేసుల్లో 71 శాతం మందిలో కొవిడ్‌ లక్షణాలు కనిపించగా.. 29 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేవు. 

రెండు డోసులతో పోలీసులకు రక్షణ

కొవిడ్‌ ముప్పు ఎక్కువగా పొంచి ఉండే పోలీసు సిబ్బందికి టీకాలు ఇవ్వడం సత్ఫలితాలను ఇచ్చిందని ఐసీఎంఆర్‌ నిర్వహించిన మరో అధ్యయనంలో తేలింది. డెల్టా వేరియంట్‌తో తలెత్తిన రెండో ఉద్ధృతిలో 95 మరణాలను తగ్గించడానికి ఇది వీలు కల్పించిందని వెల్లడైంది. తమిళనాడులో 1,17,524 మంది పోలీసు సిబ్బందిపై దీన్ని నిర్వహించారు. వీరిలో 17,059 మంది టీకా పొందలేదు. 32,792 మంది ఒక డోసును, 67,673 మంది రెండు డోసులు పొందారు. 
టీకా పొందనివారిలో కొవిడ్‌తో చనిపోయినవారు 20 మంది ఉన్నారు. మొదటి డోసు పొందాక ప్రాణాలు కోల్పోయినవారు ఏడుగురు, రెండో డోసు పొందాక చనిపోయినవారు నలుగురు ఉన్నారు. 

మొదటి డోసు పొందినవారిలో టీకా సమర్థత 82%, రెండో డోసు పొందినవారిలో 95% కనిపించింది. 

టీకా పొందనివారిలో కొవిడ్‌-19 మరణాలు ప్రతి వెయ్యి మందిలో 1.17గా ఉండగా.. పాక్షికంగా టీకా పొందినవారిలో అది 0.21గా, పూర్తిస్థాయిలో టీకా పొందినవారిలో అది 0.06గా ఉంది. 
దీన్ని బట్టి మన టీకాలు సురక్షితమని, తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ను నివారించడంలో సమర్థత చాటుతున్నట్లు స్పష్టమైందని నీతి ఆయోగ్‌ సభ్యుడు వి.కె.పాల్‌ తెలిపారు.

కొత్త వేరియంట్ల గుర్తింపు

డెల్టా ఉపరకాలైన ఏవై.1, ఏవై.2లనూ ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రకం వైరస్‌ల స్పైక్‌ ప్రొటీన్‌లో కే417ఎన్, ఈ484కె, ఎల్‌452ఆర్, ఈ484క్యూ అనే ఉత్పరివర్తనలను గుర్తించారు. ప్రస్తుత టీకాల వల్ల ఉత్పన్నమైన మానవ రోగ నిరోధక స్పందన నుంచి తప్పించుకోవడానికి ఇవి వైరస్‌కు సాయపడొచ్చని పరిశోధకులు చెప్పారు. తద్వారా ఆ రకాల సంక్రమణం వేగంగా ఉండొచ్చని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని