Covid: ముక్కుకు తెలుసు.. కొవిడ్‌ ఎవరిలో తీవ్రమవుతుందో!

కొవిడ్‌ బాధితుల్లో కొంతమందే తీవ్రస్థాయి అనారోగ్యం బారిన పడుతున్నారెందుకు?

Published : 25 Jul 2021 11:39 IST

బోస్టన్‌: కొవిడ్‌ బాధితుల్లో కొంతమందే తీవ్రస్థాయి అనారోగ్యం బారిన పడుతున్నారెందుకు? ఎలాంటి వారిలో ఈ పరిస్థితి తలెత్తుతోంది? అన్న చిక్కుముడిని విప్పేందుకు అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధన సాగించారు. అనారోగ్య తీవ్రతను అంచనా కట్టడానికి వైద్య నిపుణులు సాధారణంగా రక్త పరీక్షలు చేస్తుంటారు. అయితే, ముప్పును అంచనా వేయడానికి అదేమీ అంత సరైన పరీక్ష కాదంటున్నారు... మసాచుసెట్స్, మిసిసిపీ విశ్వవిద్యాలయాల పరిశోధకులు! ముక్కు, నోటి కుహరంలోని కణాలను పరీక్షించడం ద్వారా కొవిడ్‌ బాధితుల్లో ఎవరెవరు తీవ్ర అనారోగ్యం బారినపడే ప్రమాదముందన్నది తెలుసుకోవచ్చని ప్రతిపాదించారు. పరిశోధనలో భాగంగా వారు గత ఏడాది ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య 35 మంది కొవిడ్‌ బాధితుల నాసికా రంధ్రాల్లోంచి నమూనాలను సేకరించారు. ఒక్కో నమూనాలో సగటున 562 కణాలు ఉన్నట్టు వారు లెక్కగట్టారు. ప్రతి కణంలోని ఆర్‌ఎన్‌ఏను నిశితంగా విశ్లేషించారు. ‘‘శరీర అంతర్భాగాల వరకూ కరోనా వైరస్‌ వ్యాపించడానికి ముందే... ముక్కు, నోరు దాన్ని ఎదుర్కొంటాయి. వైరస్‌ సోకగానే వాటిలోని కణాలు ఎలా స్పందిస్తాయన్న అంశంపై దృష్టి సారించాం.

తద్వారా బాధితుడికి స్వల్ప లక్షణాలుంటాయా? తీవ్ర అనారోగ్యం ఎదురవుతుందా? అన్నది ప్రాథమికంగా అంచనా వేయొచ్చు. కరోనా వైరస్‌ ముక్కు లేదా నోటిలోకి ప్రవేశించగానే... కణాల మధ్యనుండే ఎపీథెలియాల్‌ ధాతువుల్లో మార్పు చోటుచేసుకుంటుంది. ఈ క్రమంలోనే శ్లేష్మాన్ని ఉత్పత్తిచేసే సీక్రెటరీ, గోబ్లెట్‌ కణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతాయి. శ్వాసనాళంలో బ్యాక్టీరియా ప్రయాణానికి దోహదపడే అపరిపక్వ సీలియేటెడ్‌ కణాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతాయి. వీటి స్థాయులను తెలుసుకోవడం ద్వారా... కరోనా వైరస్‌కు రోగనిరోధక వ్యవస్థ ప్రాథమికంగా ఎలా స్పందిస్తోంది, శరీరంలోని కణాలు వాటికి ఎలా లొంగిపోతున్నాయి, వైరస్‌ లోడు ఎంత వేగంగా పెరుగుతోందన్న విషయాలను తెలుసుకోవచ్చు. తద్వారా అనారోగ్య తీవ్రతను అంచనా వేయొచ్చు’’ అని పరిశోధనకర్త అలెక్స్‌ షాలెక్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని