టిబెట్‌ పీఠభూమిలో 15వేల ఏళ్లనాటి వైరస్‌లు

ఇప్పటివరకూ తెలియని పురాతన వైరస్‌లను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు.

Updated : 26 Jul 2021 15:01 IST

వాషింగ్టన్‌: ఇప్పటివరకూ తెలియని పురాతన వైరస్‌లను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి 15వేల సంవత్సరాల నాటివని తేల్చారు. టిబెట్‌ పీఠభూమిపైన ఉన్న ఒక హిమానీనదంలోని మంచు నమూనాల్లో ఇవి వెలుగు చూశాయి. పశ్చిమ చైనాలో 22వేల అడుగుల ఎత్తులో ఉన్న గులియా మంచు పర్వతం నుంచి శాస్త్రవేత్తలు రెండు మంచు కోర్‌ నమూనాలను సేకరించారు. శిఖారాగ్రం నుంచి 1,017 అడుగుల లోతులో వీటిని తీసుకొని, పరిశీలన జరిపారు. అందులో 33 రకాల వైరస్‌లను గుర్తించారు. వాటిలో 28 రకాల గురించి మానవాళికి ఇప్పటివరకూ తెలియదు. ఘనీభవించి ఉండటం వల్ల అవి ఇన్నేళ్లపాటు భద్రంగా ఉన్నాయి. ఇవి మట్టి లేదా మొక్కల నుంచి వచ్చి ఉంటాయని, జంతువుల నుంచి వచ్చి ఉండకపోవచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో మనుగడ సాగించేలా అవి మార్పులకు లోనైనట్లు తెలిపారు. వాటి వల్ల మానవులకు హాని జరగదని వివరించారు. ‘‘మంచు కొండల్లో ఉండే వైరస్‌ల గురించి పెద్దగా వివరాలు తెలియదు. వాతావరణ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా మంచు కరుగుతున్న నేపథ్యంలో వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది’’ అని పరిశోధనకు నాయకత్వం వహించిన లోనీ థాంప్సన్‌ చెప్పారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని