Heavy rains: బెంగాల్‌లో భారీ వర్షాలకు 15 మంది బలి

పశ్చిమ బెంగాల్‌లో వరదలు ముంచెత్తుతున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌(డీవీసీ) ఆధ్వర్యంలోని పంచెట్, మైథాన్‌ ఆనకట్టల నుంచి నీటిని విడుదల చేయడంతో..

Updated : 04 Aug 2021 12:21 IST

నిరాశ్రయులైన 3 లక్షల మంది

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో వరదలు ముంచెత్తుతున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌(డీవీసీ) ఆధ్వర్యంలోని పంచెట్, మైథాన్‌ ఆనకట్టల నుంచి నీటిని విడుదల చేయడంతో ఆరు జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తూర్పు వర్ధమాన్, పశ్చిమ వర్ధమాన్, పశ్చిమ మెదినీపుర్, హూగ్లీ, హావ్‌డా, దక్షిణ 24 పరగణాలు జిల్లాల్లో చాలా ప్రాంతాలు మంగళవారం జలదిగ్బంధమయ్యాయి. కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయారని, 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం విహంగ వీక్షణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం ఆధ్వర్యంలోని డీవీసీ కావాలనే ఆనకట్టల నుంచి నీటిని ఎక్కువస్థాయిలో విడుదల చేసిందని, దీనివల్లే కృత్రిమ వరద ఏర్పడిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి సౌమెన్‌ మహాపాత్ర ఆరోపించారు.

మధ్యప్రదేశ్‌లో కుంభవృష్టి
భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌-చంబల్‌ ప్రాంతం లో మంగళవారం కుంభవృష్టి కురిసింది. దీంతో 1,171 గ్రామాలు ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా శివ్‌పురి, షియోపుర్‌ జిల్లాల్లో మునుపెన్నడూ లేని రీతిలో 800 మి.మీ. వర్షపాతం నమోదైంది. 200 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. దటియా నుంచి రత్నగఢ్‌ ఆలయానికి వెళ్లే మార్గంలో ఉన్న వంతెన కొట్టుకుపోయింది. 2013లో ఇదే వంతెనపై జరిగిన తొక్కిసలాటలో 115 మంది భక్తులు మరణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని