Indian Navy: సాగర జలాల్లో త్రినేత్రం.. మూడో విమానవాహక నౌక కోసం నేవీ ప్రతిపాదన

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న స్వదేశీ విమానవాహక నౌక సాగర ప్రవేశం చేయడం

Updated : 08 Aug 2021 10:21 IST

దాడి సామర్థ్య మెరుగుకు అవసరమని వాదన 

దిల్లీ: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న స్వదేశీ విమానవాహక నౌక సాగర ప్రవేశం చేయడం భారత నౌకాదళంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. శత్రువు కంటపడకుండా సముద్ర జలాల్లో సంచరించే స్టెల్త్‌ జలాంతర్గాములపై ఆసక్తి ఉన్నప్పటికీ కనీసం మూడు విమానవాహక నౌకలను కలిగి ఉండాలన్న ఆకాంక్ష ఈ దళంలో ఎక్కువగా ఉంది. దీన్ని సాకారం చేసుకోవాలని గట్టిగా భావిస్తోంది. 
ప్రస్తుతం భారత నౌకాదళంలో ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య అనే విమానవాహక నౌక ఒకటే సేవలు అందిస్తోంది. దీన్ని రష్యా నుంచి మన దేశం కొనుగోలు చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో తాజాగా 37,500 టన్నుల బరువైన స్వదేశీ విమాన వాహక నౌక (ఐఏసీ-1) సిద్ధమైంది. కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ నుంచి నాలుగు రోజుల సాగర పరీక్షల కోసం అరేబియా సముద్రంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. నౌకాదళంలో చేరాక దీనికి ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ అని నామకరణం చేస్తారు. 2023లో అది సాకారం కావొచ్చు.

ఏం పరీక్షిస్తారు?

సముద్ర జలాల్లో (ఐఏసీ-1)కు ప్రధానంగా ‘డ్రాట్‌’ పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఈ భారీ నౌక సురక్షితంగా ప్రయాణించడానికి అవసరమైన లోతును నిర్ధరిస్తారు. ఇది దాదాపు 30 మీటర్లు ఉండొచ్చని అంచనా. లంగరు వేసినప్పుడు నౌక ఎంత స్థిరంగా ఉంటుందన్నదీ పరిశీలించనున్నారు. అలాగే స్టీరింగ్, ఎలక్ట్రానిక్‌ సాధనాల సత్తా, ఇంజిన్‌ ఏకబిగిన ఎంతసేపు పనిచేయగలదు, నౌక వేగం వంటివి పరీక్షించనున్నారు. ఈ యుద్ధనౌక నేవీలో చేరాకే.. దీని డెక్‌ నుంచి ఆయుధాలతో కూడిన యుద్ధవిమానాలు, హెలికాప్టర్ల టేకాఫ్, ల్యాండింగ్‌ పరీక్షలు నిర్వహిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.

మూడు కావాలి

రెండో విమానవాహక నౌక సిద్ధమైన నేపథ్యంలో.. మూడోదాని కోసం నేవీ కసరత్తు కొనసాగిస్తోంది. ఇలాంటి నౌకలు మూడు అవసరమని 1985-2000 కాలానికి సంబంధించిన తన ప్రణాళికలోనే ప్రతిపాదించింది. వీటిలో ఒకటి మరమ్మతులు, నిర్వహణ పనుల కోసం లంగరు వేసినా.. మిగతా రెండు తూర్పు, పశ్చిమ తీరాల్లో ఒక్కొక్కటి చొప్పున విధులు నిర్వర్తించాలని అందులో పేర్కొంది. దీనివల్ల నేవీ దాడి, ఆత్మరక్షణ సామర్థ్యం రాటుదేలుతుందని తెలిపింది. స్వదేశీ పరిజ్ఞానంతో ఒక విమానవాహక నౌక విజయవంతంగా సిద్ధం కావడంతో ఆ అనుభవాన్ని ఉపయోగించి రెండో నౌకను సులువుగానే సిద్ధం చేయవచ్చని చెబుతున్నారు.

చైనా వద్ద షాండాంగ్‌ (70వేల టన్నులు), లియావోనింగ్‌ (67,500 టన్నులు) అనే రెండు విమానవాహక నౌకలు ఉన్నాయి. అమెరికా వద్ద ఇలాంటివి 11 యుద్ధనౌకలు ఉన్నాయి. ఒక్కోదాని బరువు లక్ష టన్నులపైనే. ఒకప్పుడు సముద్రంలో ఒక దేశ సత్తాకు విమానవాహక నౌకలే తార్కాణంగా ఉండేవి. బాలిస్టిక్‌ క్షిపణులు, హైపర్‌ సోనిక్‌ అస్త్రాల రాకతో వీటి ప్రభ ఒకింత తగ్గింది. అయినా శక్తిమంతమైన యుద్ధవిమానాలు, హెలికాప్టర్లతో సాగర జలాల్లో కదిలే నగరంలా కనిపించే విమానవాహక నౌక.. శత్రువు వెన్నులో దడ పుట్టించడం ఖాయం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు