UP Elections: యూపీ ఎన్నికల ప్రచారాస్త్రం అయోధ్యే!

వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తర్‌ప్రదేశ్‌లో అయోధ్యే కీలకమైన ప్రచారాస్త్రం కానుంది. బాబ్రీ మసీదు స్థల వివాదంపై

Published : 13 Sep 2021 22:20 IST

 సిద్ధమవుతున్న పార్టీలు 

లఖ్‌నవూ: వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తర్‌ప్రదేశ్‌లో అయోధ్యే కీలకమైన ప్రచారాస్త్రం కానుంది. బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఇదే ప్రథమం. ప్రచారంలో అయోధ్య రామాలయమే ముఖ్యమైన అంశంగా నిలుస్తుందనే సంకేతాలు ఇప్పటికే ఆయా పార్టీల నుంచి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలల వ్యవధే మిగిలి ఉంది. భాజపా, ఎస్పీ, బీఎస్పీ సహా పలు పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని ఈ అంశంతోనే ప్రారంభించనున్నాయి. ప్రస్తుతం అయోధ్య అసెంబ్లీ స్థానానికి భాజపా అభ్యర్థి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఎప్పటికప్పుడు ఈ నగరాన్ని సందర్శిస్తున్నారు. అయోధ్యలో రామాలయం తమకి ఎప్పటికీ ముఖ్యమేనని, దానిని ఎన్నికల కోణంలో చూడడం లేదని భాజపా యూపీ అధికార ప్రతినిధి మనీష్‌ శుక్లా చెబుతున్నారు. దళితులు, బ్రాహ్మణుల మద్దతు పొంది 2007 మాదిరి విజయాన్ని మరోసారి సాధించాలని బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఆశపడుతోంది. ఎన్నికల ప్రచారాన్ని అయోధ్య అంశంతో ప్రారంభించడానికి కాంగ్రెస్‌ మాత్రం దూరంగా ఉండేలా ఉంది. దీని బదులు యూపీలో అన్ని గ్రామాలు, పట్టణాల మీదుగా 12,000 కి.మీ. మేర ప్రతిజ్ఞ యాత్రను ఆ పార్టీ చేపట్టనుంది. 

ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించనున్న కాంగ్రెస్‌ 

రాయ్‌బరేలీ: యూపీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థుల్ని వీలైనంత ముందుగానే ప్రకటిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తెలిపారు. తన తల్లి సోనియాగాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ నియోజకవర్గంలో రెండ్రోజుల పర్యటనకు ఆదివారం ఆమె శ్రీకారం చుట్టారు. తొలుత హనుమాన్‌ మందిరంలో పూజలు జరిపారు. అభ్యర్థుల పేర్లను ముందుగానే ప్రకటించడం గురించి కార్యకర్తల సమావేశంలో ప్రియాంక వెల్లడించారని పార్టీ నాయకుడొకరు తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు