DRDO: హనీట్రాప్‌.. 18 నెలలుగా రహస్య సమాచారం సేకరించిన మహిళ

ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా చాందీపూర్‌లో డీఆర్‌డీవో రహస్యాల లీకు ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి.

Published : 23 Sep 2021 10:50 IST

 

కటక్, న్యూస్‌టుడే: ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా చాందీపూర్‌లో డీఆర్‌డీవో రహస్యాల లీకు ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఐదుగురు డీఆర్‌డీవో సిబ్బంది ఒక మహిళకు రహస్య సమాచారం పంపించేవారని తెలిసింది. పోలీస్‌ కస్టడీలో ఉన్న ఈ ఐదుగురిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ), ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్, కటక్‌ క్రైం బ్రాంచ్‌ అధికారులు విచారిస్తున్నారు. బుధవారం క్రైం బ్రాంచ్‌ ఏడీజీ సంజీబ్‌ పండా విలేకరులతో మాట్లాడుతూ.. ఓ మహిళ ఫోన్, చాటింగ్‌ ద్వారా ఈ ఐదుగురికి దగ్గరైందన్నారు. ఒక్కొక్కరిని ఒక్కో పేరుతో పరిచయం చేసుకొని వీడియోకాల్, ఫేస్‌బుక్, వాట్సప్‌లో సంభాషించినట్లు, వీరిలో కొంతమందిని పెళ్లి చేసుకుంటానని నమ్మించినట్లు చెప్పారు. బ్రిటన్‌లో ఉంటున్నానని ఒకరితో, రాజస్థాన్‌లో అని మరొకరితో చెప్పి మోసగించినట్లు వెల్లడించారు. రక్షణశాఖలోను, నర్సుగాను పనిచేస్తున్నాని.. ఇలా పలు రకాలుగా వారిని హనీట్రాప్‌లోకి లాగినట్లు వివరించారు.

వీరిలో ఒకరికి దుబాయ్‌ నుంచి రూ.35 వేలు పంపినట్లు దర్యాప్తులో తెలిసిందన్నారు. యూకేకు చెందిన ఫోన్‌ నంబరు ద్వారా ఆ మహిళ మాట్లాడినట్లు చెప్పారు. ఆ వివరాలు తెలుసుకునేందుకు ఎన్‌ఐఏ సాయం కోరామని, యూకేకు చెందిన అధికారులతో మాట్లాడి మహిళను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అరెస్టు చేసిన ఐదుగురిని వేర్వేరుగా విచారిస్తున్నామని, వారి బ్యాంకు ఖాతాలు సీజ్‌ చేశామన్నారు. 18 నెలలుగా ఆమె డీఆర్‌డీవో నుంచి సమాచారం సేకరించినట్లు పేర్కొన్నారు. ఈ ఐదుగురికి ఏడు రోజుల కస్టడీ వ్యవధి శుక్రవారంతో ముగియనుందని.. వీరిని కోర్టులో హాజరుపరిచి మళ్లీ కస్టడీలోకి తీసుకుంటామని ఏడీజీ సంజీబ్‌ పండా తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని