Afghanistan: అఫ్గాన్‌తో చైనా, రష్యా, పాక్‌ చర్చలు

తాలిబన్ల పాలనలోని అఫ్గానిస్థాన్‌తో సత్సంబంధాలు కొనసాగించేందుకు చైనా, రష్యా, పాకిస్థాన్‌ ఉవ్విళ్లూరుతున్నాయి.

Published : 23 Sep 2021 12:24 IST

కాబుల్‌లో ఆ దేశాల రాయబారుల పర్యటన 

బీజింగ్‌: తాలిబన్ల పాలనలోని అఫ్గానిస్థాన్‌తో సత్సంబంధాలు కొనసాగించేందుకు చైనా, రష్యా, పాకిస్థాన్‌ ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ మూడు దేశాలకు చెందిన ప్రత్యేక రాయబారులు మంగళ, బుధవారాల్లో కాబుల్‌లో పర్యటించారు. అఫ్గాన్‌ తాత్కాలిక ప్రధానమంత్రి మొహమ్మద్‌ హసన్‌ అఖుంద్, విదేశాంగ మంత్రి ఆమీర్‌ ఖాన్‌ ముత్తకీతో పాటు విదేశాంగ మంత్రి, ఇతర తాలిబన్‌ ఉన్నతాధికారులతో వారు భేటీ అయ్యారు. ప్రభుత్వంలో ఇతర వర్గాలను భాగస్వాములుగా చేసుకోవడం సహా పలు అంశాలపై చర్చలు జరిపారు. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్‌ బుధవారం విలేకర్ల సమావేశంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. సమ్మిళిత ప్రభుత్వ ఏర్పాటు, మానవ హక్కుల పరిరక్షణ, ఆర్థిక పరిస్థితులపై వారు చర్చలు జరిపినట్లు లిజియాన్‌ తెలిపారు. అఫ్గాన్‌ మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్, గత ప్రభుత్వంలోని మరో కీలక నేత అబ్దుల్లా అబ్దుల్లాలతోనూ మూడు దేశాల ప్రత్యేక రాయబారులు భేటీ అయ్యారని వెల్లడించారు. 

ఐరాసలో అవకాశమివ్వండి: గుటెరెస్‌కు తాలిబన్ల లేఖ 

అఫ్గానిస్థాన్‌లోని తమ ప్రభుత్వానికి అంతర్జాతీయ గుర్తింపును సాధించుకునే దిశగా తాలిబన్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఐక్యరాజ్యసమితిలో తమ దేశ నూతన రాయబారిగా సుహైల్‌ షహీన్‌ను నామినేట్‌ చేస్తూ ఆ సంస్థ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరెస్‌కు అఫ్గాన్‌ సర్కారు తాజాగా లేఖ రాసింది. న్యూయార్క్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఐరాస సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడేందుకు తమకు అవకాశమివ్వాలని కూడా అందులో కోరింది. 

జలాలాబాద్‌లో తాలిబన్లపై మళ్లీ దాడులు 

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు.. ముష్కరుల ధాటికి బెంబేలెత్తుతున్నారు. తూర్పు అఫ్గాన్‌లోని జలాలాబాద్‌ నగరంలో వారిపై దాడులు కొనసాగుతున్నాయి. జలాలాబాద్‌లో బుధవారం ఒక్కరోజే.. తాలిబన్‌ వాహనాలను లక్ష్యంగా చేసుకొని మూడు చోట్ల దాడులు జరిగాయి. వీటిలో కనీసం ఇద్దరు ముఠా సభ్యులు సహా మొత్తం ఐదుగురు మృత్యువాతపడ్డారు. తొలుత తాలిబన్ల వాహనంపై ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ముఠా సభ్యులు హతమయ్యారు. అదే ఘటనలో ఓ చిన్నారి, గ్యాస్‌ స్టేషన్‌ సిబ్బంది ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో.. తాలిబన్‌ వాహనంపై బాంబు దాడి చోటుచేసుకోగా ఓ చిన్నారి దుర్మరణం పాలైనట్లు స్థానికులు తెలిపారు. తాజా దాడులకు పాల్పడింది ఎవరన్నదీ ఇంకా తెలియరాలేదు. గత వారం కూడా జలాలాబాద్‌లో తాలిబన్లను లక్ష్యంగా చేసుకొని వరుస దాడులు చోటు
చేసుకున్నాయి. వాటిలో కనీసం 8 మంది మృత్యువాతపడ్డారు. గతవారం దాడులకు తెగబడింది తామేనని ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ప్రకటించింది. తాలిబన్, ఐఎస్‌ ముఠాల మధ్య దీర్ఘకాలంగా శత్రుత్వం ఉన్న సంగతి తెలిసిందే.

తాలిబన్లను బాయ్‌కాట్‌ చేయొద్దు: కతర్‌

ఐరాస: తాలిబన్లను బాయ్‌కాట్‌ చేయొద్దని, వారి నేతృత్వంలోని అఫ్గానిస్థాన్‌ సర్కారుకు అధికారిక గుర్తింపునివ్వాలని ప్రపంచ నేతలను కతర్‌ కోరింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో కతర్‌ ఎమిర్‌ షేక్‌ తమీమ్‌ బిన్‌ హమద్‌ అల్‌ థానీ మంగళవారం ప్రసంగించారు. తాలిబన్లతో అంతర్జాతీయ సమాజం సంప్రదింపులు కొనసాగించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. వారిని బాయ్‌కాట్‌ చేస్తే మరిన్ని సమస్యలు తలెత్తే ముప్పుందని పేర్కొన్నారు. వారితో చర్చలు జరపడం వల్ల సానుకూల ఫలితాలను రాబట్టొచ్చని సూచించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని