supreme court: నిందితుల వారసత్వ ఆస్తిని జప్తు చేయొచ్చా?
నగదు అక్రమ చలామణి నిరోధక చట్ట (పీఎంఎల్ఏ) సంబంధిత కేసుల్లో నిందితుల వారసత్వ ఆస్తిని ‘నేర చర్య ద్వారా ఆర్జించిన
దాన్ని ‘నేర చర్య ద్వారా ఆర్జించిన ఆస్తిగా’ పరిగణించొచ్చా?
ఈ చట్టపర అంశంపై పరిశీలన జరుపుతాం: సుప్రీంకోర్టు
దిల్లీ: నగదు అక్రమ చలామణి నిరోధక చట్ట (పీఎంఎల్ఏ) సంబంధిత కేసుల్లో నిందితుల వారసత్వ ఆస్తిని ‘నేర చర్య ద్వారా ఆర్జించిన ఆస్తిగా’ పరిగణించి జప్తు చేయవచ్చా అనే చట్టపరమైన అంశాన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ‘పీఎంఎల్ఏ-2002’ కింద తీసుకునే చర్యల పరిధిలోకి వారసత్వ ఆస్తి రాదని కర్ణాటక హైకోర్టు ఓ కేసులో ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ అంశం సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఈడీ పిటిషన్పై జస్టిస్ ఎ.ఎం. ఖన్విల్కర్, జస్టిస్ సి.టి.రవికుమార్ల ధర్మాసనం ఈ నెల 8న విచారణ చేపట్టింది. పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 2(1)(యు)లో పేర్కొన్న ‘నేర చర్య ద్వారా ఆర్జించిన ఆస్తుల’ నిర్వచనానికి విరుద్ధంగా హైకోర్టు తీర్పు ఉందని ఈడీ తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు ధర్మాసనానికి తెలిపారు. ఆ నిర్వచనం ప్రకారం.. ఏ వ్యక్తి అయినా నేర చర్య ద్యారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పొందిన ఆస్తి, లేదా అలాంటి ఆస్తికి చెందిన విలువ, బయటి దేశాల్లో పొందిన అలాంటి ఆస్తికి సమాన విలువ కలిగిన స్వదేశంలోని ఆస్తిని నేర చర్య ద్వారా ఆర్జించిన ఆస్తిగా పరిగణించాలని స్పష్టంగా ఉందని చెప్పారు.
ఏమిటా కేసు?
ప్రభుత్వ పరిధిలోని మైసూరు సేల్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థకు 50 వేల టన్నుల ఇనుప ఖనిజాన్ని సరఫరా చేసేందుకు నిందితుడు రెండు ఒప్పందాలు చేసుకున్నాడు. ఇందులో భాగంగా లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా నిందితుని బ్యాంకు ఖాతాకి ఆ సంస్థ మొత్తం రూ.2.15 కోట్లు బదిలీ చేసింది. ఆ తర్వాత అతడు ఇనుప ఖనిజాన్ని సరఫరా చేయడంలో విఫలమయ్యాడు. దీంతో అతడి…పై సెక్షన్ 406(విశ్వాస ఉల్లంఘన), సెక్షన్ 420(మోసం) కింద కేసు నమోదైంది. దీని ఆధారంగా ఈడీ పీఎంఎల్ఏ కింద అభియోగాలు మోపింది. నిందితుడు రూ.2.15 కోట్ల అడ్వాన్స్ పొందడానికి నిబంధనల ప్రకారం తన ఆస్తిని చట్టబద్ధంగా తనఖా పెట్టాల్సి ఉండగా, కుట్రపూరిత ఉద్దేశంతో దాన్ని పాటించలేదని ఈడీ ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత తన చెక్ను బదలాయించడానికి ఇచ్చినప్పుడు తగినన్ని నిధులు బ్యాంకు ఖాతాలో ఉంచలేదని తెలిపింది. అనంతరం తన ఆస్తులను అమ్మడానికి, భార్యకు, కుమార్తెకు కానుకగా ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నాడని వివరించింది. కాబట్టి అడ్వాన్సు ద్వారా పొందిన మొత్తాన్ని నేరం ద్వారా ఆర్జించిన సొమ్ముగా పరిగణించి అతడి ఆస్తులను అటాచ్ చేయడానికి అనుమతినివ్వాలని కోరింది. అయితే కర్ణాటక హైకోర్టు ఈడీ వాదనను అంగీకరించలేదు. ‘‘ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. నిందితుడు ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించాడని, అడ్వాన్సు తిరిగి ఇవ్వడంలో విఫలమయ్యాడని, చెక్ జారీ నిబంధనలు పాటించలేదని భావించవచ్చు. అలాంటప్పుడు సంబంధిత సెక్షన్ల కింద అభియోగాలు మోపొచ్చు. కానీ నిందితుడు అనుచిత లబ్ధి పొందడానికే నేరం చేశాడని చెప్పలేం’’ అని పేర్కొంటూ కేసును కొట్టివేసింది. దీనిపై ఈడీ సుప్రీంను ఆశ్రయించింది.
కేసుల రికార్డులను డిజిటల్ రూపంలో పంపాలి
న్యాయ సహాయం అంశాల్లో గుణాత్మక సహకారాన్ని అందించేందుకు వీలుగా సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అవసరమైనప్పుడు కేసుల పూర్తి రికార్డులను డిజిటల్ రూపంలో పంపాలని రాష్ట్రాల న్యాయ సేవా సంస్థలను ఆదేశించింది. ఓ క్రిమినల్ కేసు విచారణ సందర్భంగా దానికి సంబంధించిన సాక్ష్యాధార వివరాలను రాజస్థాన్ న్యాయ సేవా సంస్థ సుప్రీం కోర్టు సహాయకారికి (అమికస్ క్యూరీ) పంపకపోవడాన్ని ప్రస్తావిస్తూ జస్టిస్ ఉదయ్ ఉమేశ్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్ల ధర్మాసనం ఈ నెల 8న ఈ ఆదేశాలిచ్చింది. ‘‘న్యాయ సహాయ అంశాల్లో నాణ్యమైన సహకారం అందించే దిశగా తీర్పులివ్వడానికి అవసరమైన సమగ్ర వివరాలను అమికస్ క్యూరీకి లేదా సుప్రీం కోర్టు న్యాయ సేవల కమిటీకి అందించని సందర్భాలు తరచుగా ఎదురవుతున్నాయి. ఇకపై సుప్రీం కోర్టు రిజిస్ట్రీ పరిధిలోని అమికస్ క్యూరీ ప్యానెల్ కానీ, సుప్రీం కోర్టు న్యాయ సేవల కమిటీ కానీ కేసుల పూర్తి రికార్డులను పంపమని అడిగినప్పుడు సంబంధిత రాష్ట్ర న్యాయ సేవా సంస్థ లేదా హైకోర్టు న్యాయ సేవా కమిటీ వాటిని విధిగా డిజిటల్ రూపంలో పంపాలి’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.
దర్యాప్తునకు సహకరించని నిందితులకు రక్షణ కల్పించలేం
కేసు దర్యాప్తులో సహకరించని, పరారీలో ఉన్న నిందితుడికి న్యాయస్థానం రక్షణ కల్పించదని సుప్రీం కోర్టు పేర్కొంది. అల్లర్ల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ముందస్తు బెయిల్్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఉత్తర్ప్రదేశ్లోని బలియా జిల్లాకు చెందిన వ్యక్తి(పిటిషనర్)పై అల్లర్ల కేసుకు సంబంధించి 2018 నవంబరులో ఛార్జిషీటు నమోదైంది. అతడు ట్రయల్ కోర్టులో విచారణకు సహకరించడం లేదన్న కారణంతో అలహాబాద్ హైకోర్టు ఈ ఏడాది జూన్లో అతడి ముందస్తు బెయిల్ అభ్యర్థనను తిరస్కరింంచింది. దీంతో అతడు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. దీనిపై జస్టిస్ ఎం.ఆర్.షా, ఎ.ఎస్.బోపన్నల ధర్మాసనం విచారణ చేపట్టింది. కేసులో నిందితుడిగా ఉన్న పిటిషనర్ నిరంతరం పరారీలో ఉన్న విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. అతడు నెల రోజుల్లోపు కోర్టుకు వచ్చి లొంగిపోతే, తన బెయిల్ పిటిషన్ను పరిశీలిస్తామని హైకోర్టు 2019 డిసెంబరులోనే ఆదేశించిందని, అయినా అతడు దాన్ని ఖాతరు చేయలేదని, దీంతో హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని గుర్తు చేసింది. ఈ విధంగా దర్యాప్తు సంస్థలకు సహకరించకుండా పరారీలో ఉన్న వ్యక్తికి, అందులోనూ నాన్ బెయిలబుల్ వారెంటు ఉన్న నిందితుడికి రక్షణ కల్పించలేమని స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్