Corona Virus: కరోనా యాంటీబాడీల సమర్థతను గుర్తించే ర్యాపిడ్‌ పరీక్ష!

కరోనా సోకడం లేదా టీకా తీసుకోవడం ద్వారా శరీరంలో ఉత్పత్తయ్యే యాంటీబాడీలు.. ఒమిక్రాన్‌ సహా వివిధ వేరియంట్లను

Published : 05 Dec 2021 14:01 IST

కాలిఫోర్నియా: కరోనా సోకడం లేదా టీకా తీసుకోవడం ద్వారా శరీరంలో ఉత్పత్తయ్యే యాంటీబాడీలు.. ఒమిక్రాన్‌ సహా వివిధ వేరియంట్లను ఎంత సమర్థంగా అడ్డుకోగలవన్నది తెలుసుకునేందుకు సరికొత్త ర్యాపిడ్‌ పరీక్ష అందుబాటులోకి వచ్చింది! ఈ పరీక్ష ద్వారా వివిధ వేరియంట్లకు వ్యతిరేకంగా ఒక వ్యక్తికి ఎంతమేర రక్షణ ఉందన్నది తెలుసుకునే అవకాశముంది. డ్యూక్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సాగించిన ఈ పరిశోధన వివరాలను సైన్స్‌ అడ్వాన్సెస్‌ పత్రిక అందించింది. వ్యక్తులకు ఏ వేరియంట్‌ సోకింది? వారిలో ఏ తరహా యాంటీబాడీలు, ఏ స్థాయిలో ఉన్నాయి? వివిధ వేరియంట్లకు వ్యతిరేకంగా అవి ఎంత సమర్థంగా పనిచేస్తాయి? అన్న విషయాలను తెలుసుకునేందుకు ప్రస్తుతం ఎలాంటి ర్యాపిడ్‌ పరీక్షలూ అందుబాటులో లేవు. దీంతో శాస్త్రవేత్తలు ఈ దిశగా పరిశోధన సాగించి ‘కోవేరియంట్‌-న్‌’ అనే పరీక్షను రూపొందించారు.

ఇది ఎలా పనిచేస్తుంది? ‘‘నిర్దిష్ట బయోమార్కర్లను మాత్రమే గుర్తించేలా పాలిమర్‌ బ్రష్‌ కోటింగ్‌తో ఒక ఫలకను రూపొందించాం. దీనికి ఒక వైపు మనిషిలో ఉండే ‘ఏసీఈ2’ ప్రొటీన్లను ఉంచాం. కరోనా స్పైక్‌ ప్రొటీన్లు లక్ష్యం చేసుకునేది వీటినే. మరోవైపు- అదే ఫలకపై కొన్నిచోట్ల వివిధ వేరియంట్లకు చెందిన స్పైక్‌ ప్రొటీన్లను ముద్రించాం. పరీక్ష సమయంలో ఏసీఈ2 ప్రొటీన్లు స్పైక్‌ ప్రొటీన్లతో అతుక్కుపోయాయి. తదుపరి పరీక్షలో వివిధ రకాల యాంటీబాడీలను కూడా ఫలకపై ఉంచాం. అప్పుడు కొన్ని స్పైక్‌ ప్రొటీన్లు ఏసీఈ2 రిసిప్టర్లను గ్రహించలేదు. మరికొన్ని కొంతవరకే వాటితో అతుక్కున్నాయి. ఆ సమయంలో కొన్ని బల్బులు పూర్తిగా వెలగలేదు. బల్బులు కాంతిని ప్రసరించే తీరును బట్టి.. ఒక వ్యక్తిలోని యాంటీబాడీలు వివిధ వేరియంట్లకు వ్యతిరేకంగా ఎంత సమర్థంగా పనిచేయగలవన్నది తెలుసుకోవచ్చు’’ అని పరిశోధనకర్త కామెరాన్‌ వోల్ఫ్‌ వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని