
Joe biden: బైడెన్ జట్టులో మరో నలుగురు భారతీయులు!
వాషింగ్టన్: ఆసియన్ అమెరికన్లు, నేటివ్ హవాయియన్లు, పసిఫిక్ ద్వీపవాసులకు (ఏఏఎన్హెచ్పీఐ) సంబంధించిన సలహా కమిషన్లో నలుగురు భారతీయ అమెరికన్లను నియమించాలన్న ఉద్దేశాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం వెల్లడించారు. ఈ జాబితాలో అజయ్ జైన్ భుటోరియా, సోనాల్ షా, కమల్ కాల్సీ, స్మితా ఎన్ షాలు ఉన్నారు. ప్రతిఒక్క అసియా అమెరికన్, నేటివ్ హవాయియన్, పసిఫిక్ ద్వీపవాసి సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం, ప్రైవేట్, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేసే అంశాలపై ఈ కమిషన్ అధ్యక్షుడికి సలహాలిస్తుంది. ఆసియన్లు ఎదుర్కొంటున్న విద్వేషం, హింసను కట్టడి చేయడంపై సూచనలు చేస్తుంది.
♦ సిలికాన్ వ్యాలీలో టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్గా అజయ్ భుటోరియా పనిచేస్తున్నారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఆర్థిక వేత్త సోనాల్ షా విద్యారంగంలో విశేష కృషి చేశారు. ద ఆసియన్ అమెరికన్ ఫౌండేషన్ (టీఏఏఎఫ్) వ్యవస్థాపక అధ్యక్షురాలు. న్యూజెర్సీకి చెందిన డాక్టర్ కమల్ సింగ్ కాల్సి అత్యవసర వైద్య చికిత్స నిపుణుడు. అమెరికా సైన్యంలో 20 ఏళ్ల పాటు సేవలు అందించారు. అఫ్గానిస్థాన్లో ఆయన అందించిన సేవలకుగాను ప్రభుత్వం కాంస్య నక్షత్ర పతకం ఇచ్చి గౌరవించింది. ఇంజినీర్, వ్యాపారవేత్త అయిన స్మితా ఎన్ షా.. షికాగోకు చెందిన స్పాన్ టెక్కు సీఈఓగా ఉన్నారు. దిల్లీ-షికాగో సిస్టర్ సిటీస్ కార్యక్రమం, షికాగో ప్లాన్ కమిషన్ తదితర కార్యక్రమాల్లో ఆమె పనిచేశారు.