
కుటుంబ వ్యవస్థల బలోపేతం అందరి బాధ్యత
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
చెన్నై, న్యూస్టుడే: కుటుంబం, వివాహ వ్యవస్థలను బలంగా ఉంచుకోవడం అందరి బాధ్యతని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. చెన్నై పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి కోట్టూర్పురంలోని స్వగృహంలో సంక్రాంతి పండగ చేసుకున్నారు. ఈ సందర్భంగా నెల్లూరులోని స్వర్ణభారత్ ట్రస్టు ఆశ్రమంలోని వారితో అంతర్జాల వేదికగా శనివారం మాట్లాడారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ప్రతి పండగకు ఓ పరమార్థం ఉందన్నారు. పండగలన్నీ అన్నదాతలు, పాడిపంటల కేంద్రంగానే ఉంటాయని తెలిపారు. భోగి, సంక్రాంతి, కనుమ పండగలు కూడా కొత్త పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు చేసుకునేవని పేర్కొన్నారు. మన జీవితానికి కారణమైన పెద్దలను, ఆనందకరమైన జీవనానికి కారణమైన సమాజాన్ని గౌరవించాలనే గొప్ప అంతరార్థం ఈ పండగ సొంతమని తెలిపారు. ఈ సంప్రదాయాలను కాపాడుకోవాలని, వాటి ప్రాధాన్యతను భావితరాలకు తెలియజేసే బాధ్యతను పెద్దలు తీసుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబం, వివాహ వ్యవస్థల కారణంగానే విశ్వవ్యాప్తంగా దేశానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు.
నేటి నుంచి ఉపరాష్ట్రపతి ఏపీ పర్యటన
గన్నవరం, న్యూస్టుడే: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్టుకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 18వ తేదీ ఉదయం ట్రస్టులో వివిధ వృత్తి విద్యా కోర్సులో శిక్షణ పొందుతున్న విద్యార్థులు, అధ్యాపకులతో సమావేశమవుతారు. 19న ఉదయం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వెళ్తారు.