
మహిళల లోదుస్తుల దొంగను పట్టించిన జడ్జి
మహారాష్ట్రలోని కొల్హాపుర్ గార్గోటీ ప్రాంతంలో ఓ వ్యక్తి అందరి ఇళ్లల్లోకి చొరబడి మహిళల లోదుస్తులను చోరీ చేస్తున్నాడు. కొంతకాలంగా అనేక మంది ఇళ్లల్లో మహిళల లోదుస్తులు పోయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఓ న్యాయమూర్తి ఇంట్లోనూ ఈ ఘటన జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా దొంగ దొరకలేదు. ఇందుకు ఉపాయం ఆలోచించిన న్యాయమూర్తి.. స్వయంగా రంగంలోకి దిగి దొంగను కటకటాల వెనక్కి పంపడంలో కీలకంగా వ్యవహరించారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఎనిమిది రోజుల పాటు నిరీక్షించినా.. దొంగ దొరక్కపోవడం వల్ల.. న్యాయమూర్తి స్వయంగా ఓ పథకం రచించారు. ఇంటి బయట వస్త్రాలు ఆరబెట్టి దొంగ కోసం వేచి చూశారు. ఈ క్రమంలోనే ఇంట్లోకి వచ్చిన దొంగ.. మహిళల లోదుస్తులు, బూట్లు, చెప్పులతో పరారయ్యేందుకు ప్రయత్నించాడు. వెంటనే జడ్జి, ఆయనతో పాటు ఉన్న మరో ఇద్దరు కలిసి దొంగను పట్టుకున్నారు. ఇదంతా సీసీటీవీలో రికార్డు అయ్యింది. దొంగను సుశాంత్ సదాశివ్ చావన్గా గుర్తించారు. నిందితుడు ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.