దేశీయ విపణిలోకి నాసికా టీకా

కొవిడ్‌-19 వ్యాధికి నాసికా టీకా ‘ఇన్‌కొవ్యాక్‌’ దేశీయంగా అందుబాటులోకి వచ్చింది. కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ సహాయమంత్రి (స్వతంత్రహోదా) జితేంద్రసింగ్‌ సమక్షంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ గురువారం దిల్లీలో ఈ టీకాను విడుదల చేశారు.

Updated : 27 Jan 2023 06:19 IST

‘ఇన్‌కొవ్యాక్‌’ను విడుదల చేసిన కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ
కొవిన్‌ పోర్టల్‌లో లభ్యం
ఉత్పత్తి చేసిన భారత్‌ బయోటెక్‌

ఈనాడు, బిజినెస్‌ బ్యూరో: కొవిడ్‌-19 వ్యాధికి నాసికా టీకా ‘ఇన్‌కొవ్యాక్‌’ దేశీయంగా అందుబాటులోకి వచ్చింది. కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ సహాయమంత్రి (స్వతంత్రహోదా) జితేంద్రసింగ్‌ సమక్షంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ గురువారం దిల్లీలో ఈ టీకాను విడుదల చేశారు. కరోనాకు ప్రపంచంలోనే ఇదే తొలి నాసికా టీకా. దీన్ని ఆవిష్కరించిన ఘనత హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌కు దక్కింది. ‘ఇన్‌కొవ్యాక్‌’ టీకాను 2 ప్రాథమిక డోసులకు, బూస్టర్‌ డోసుకూ వినియోగించొచ్చు. ఈ టీకాకు ప్రైవేటు మార్కెట్లో ఒక డోసుకు రూ.800 ధర నిర్ణయించారు. ప్రభుత్వానికి రూ.350కే లభిస్తుంది. తాజాగా కొవిన్‌ పోర్టల్‌లో దీనిని పొందుపరిచారు. వాషింగ్టన్‌ యూనివర్సిటీ అందించిన సాంకేతిక పరిజ్ఞానంతో భారత్‌ బయోటెక్‌ ఈ టీకాను అభివృద్ధి చేసింది. కేంద్రం ‘కొవిడ్‌ సురక్ష’ కింద నిధులు సమకూర్చి సహకరించింది.

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా..

‘ఇన్‌కొవ్యాక్‌’ టీకాను నిల్వ చేయడం, రవాణా, భద్రపరచడంతోపాటు ప్రజలకు వేయడమూ సులువు. పోలియో చుక్కల మందును నోట్లో వేసినట్లుగానే... టీకా చుక్కలను ముక్కులో వేస్తే సరిపోతుంది. సిరంజి అవసరమే లేదు  కొవిడ్‌ వైరస్‌లో భవిష్యత్తులో వచ్చే మార్పులకు అనుగుణంగా ఈ టీకాను నవీకరించేఅవకాశం ఉండటం మరో సానుకూల అంశం. దీనికి వీలుగా వెక్టార్‌ ఆధారిత ప్లాట్‌ఫామ్‌మీద ఈ టీకాను భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసింది. అందువల్ల దీనిని ‘ఫ్యూచర్‌ రెడీ’ టీకాగా భావిస్తున్నారు. దీనిపై 2 ప్రాథమిక డోసుల క్లినికల్‌ పరీక్షలను సంస్థ దేశవ్యాప్తంగా 14చోట్ల 3,100 మంది వాలంటీర్లపై, బూస్టర్‌ డోసు పరీక్షలను 875 మందిపై నిర్వహించింది. రోగనిరోధకశక్తిని ఈటీకా కల్పించడమేగాక భద్రమైనదని నిర్ధారణ అయినట్లు పేర్కొంది.

ఆవిష్కరణలూ చేయగలమని నిరూపించింది: ‘ఇన్‌కొవ్యాక్‌’ టీకా ఆవిష్కరణ ఎంతో గొప్ప మైలురాయిగా మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ అభివర్ణించారు. మన దేశం ప్రపంచానికి మందులు అందించటమే కాకుండా.. ఆవిష్కరణలూ చేయగలదని రుజువైందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతున్న టీకాల్లో 65% మన దేశం నుంచే అందిస్తున్నట్లు తెలిపారు.


700 కోట్ల డోసుల టీకాలు అందించాం
- డాక్టర్‌ కృష్ణ ఎల్ల, భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌

నాసికా టీకాతో ఒక కొత్త ‘వ్యాక్సిన్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌’ను కనుగొన్నట్లు అయిందని భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్ల తెలిపారు. ఇలాగే మున్ముందు కొత్త టీకాలు తీసుకొస్తామన్నారు. ఇప్పటివరకూ వివిధ రకాల టీకాలను, 700 కోట్ల డోసులు ఉత్పత్తి చేసిన ఘనత తమకుందన్నారు. కొవిడ్‌ ముప్పును ఎదుర్కోవడానికి మనదేశం నుంచి 150 దేశాలకు టీకాలు సరఫరా చేసినట్లు సంస్థ ఎండీ సుచిత్ర ఎల్ల తెలిపారు. కొవిడ్‌పై పోరాటానికి, ఇన్‌కొవ్యాక్‌ టీకాతో మరోఆయుధం మన చేతిలో ఉన్నట్లు అవుతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని