దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు

ఘనమైన భారత భిన్నత్వానికి ప్రతీకగా గురువారం దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో గణతంత్ర దిన వేడుకలు కనులపండువగా జరిగాయి.

Published : 27 Jan 2023 05:04 IST

దిల్లీ: ఘనమైన భారత భిన్నత్వానికి ప్రతీకగా గురువారం దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో గణతంత్ర దిన వేడుకలు కనులపండువగా జరిగాయి. సాధించిన ప్రగతిని రాష్ట్ర ప్రభుత్వాలు నివేదికల్లో వివరించాయి. రాష్ట్రంలో మద్య వినియోగం తగ్గించేందుకు కొత్త అబ్కారీ విధానం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబరులో శాసనసభ ఎన్నికలకు వెళ్లనున్న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి యువతకు ప్రతినెలా నిరుద్యోగ భృతి అందజేస్తామని ప్రకటించారు.  

కశ్మీర్‌లో 32 మందికి అవార్డులు

కశ్మీర్‌ లోయలో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్ల మధ్య గణతంత్ర దిన వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. పొరుగు దేశం పిలుపుతో జమ్మూకశ్మీర్‌లో చిందిన ప్రతి రక్తపుబొట్టుకు, కన్నీళ్లకు ప్రతీకారం తీర్చుకుంటామని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా తన ప్రసంగంలో అన్నారు. కశ్మీరీ పండిట్‌ ఉద్యోగుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. శ్రీనగర్‌ లాల్‌చౌక్‌లోని క్లాక్‌టవర్‌పై గత 30 ఏళ్లలో రెండోసారి జాతీయ పతాకం ఎగిరింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జమ్మూకశ్మీర్‌ పాలనా యంత్రాంగం విశిష్ట సేవలు అందించిన 32 మందిని ప్రభుత్వ అవార్డులకు ఎంపిక చేసింది.

* ఉత్తర గోవాలోని సత్తారీ తాలూకాలో గల చరిత్రాత్మక నానుస్‌ కోటలో తొలిసారిగా గణతంత్ర వేడుకల గౌరవ వందన సమర్పణ జరిగింది. 1852లో పోర్చుగీసు పాలనకు వ్యతిరేకంగా ఇక్కడ చెలరేగిన భారీ తిరుగుబాటును ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ హాజరయ్యారు.  

* క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌కు ప్రమాదం జరిగిన సమయంలో.. అతనిని కాపాడిన బస్‌ డ్రైవర్‌ సుశీల్‌ కుమార్‌, కండక్టర్‌ పరంజిత్‌ నయన్‌, స్థానికులైన నిశు, రజత్‌లను రూ.లక్ష చొప్పున నగదు బహుమతులతో ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి సత్కరించారు.


విదేశాల్లో మువ్వన్నెల రెపరెపలు

లండన్‌: వివిధ దేశాల్లో ఉన్న భారతీయులు గురువారం ఘనంగా 74వ గణతంత్ర దిన వేడుకలు జరుపుకొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఇజ్రాయెల్‌, ఆస్ట్రేలియా, భూటాన్‌ ప్రధానులు బెంజమిన్‌ నెతన్యాహు, ఆంథోని అల్బనీస్‌, లోటె షెరింగ్‌ భారత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. బీజింగ్‌లోని భారత ఎంబసీలో జరిగిన కార్యక్రమంలో భారత రాయబారి ప్రదీప్‌ రావత్‌ రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలను చదివి వినిపించారు. మాస్కోలోని భారత ఎంబసీలో జరిగిన వేడుకలో రాయబారి పవన్‌ కపూర్‌ ప్రవాస భారతీయులతో ముచ్చటించారు. బ్రిటన్‌ విదేశాంగ మంత్రి జేమ్స్‌ క్లెవర్లీ భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. పాక్‌లోని ఇస్లామాబాద్‌లో ఉన్న భారత ఎంబసీలోనూ వేడుకలు జరిగాయి. నేపాల్‌లో భారత రాయబారి శ్రీ నవీన్‌ శ్రీవాత్సవ పతాకావిష్కరణ చేశారు. శ్రీలంకలో భారత హై కమిషనర్‌ గోపాల్‌ బాగ్లే కొలంబోలోని ఇండియా హౌస్‌ వేడుకల్లో పాల్గొన్నారు. యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయేద్‌.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు శుభాకాంక్షల సందేశం పంపారు. మాల్దీవులు, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌లలోనూ గణతంత్ర వేడుకలు జరిగాయి. ఈ నేతలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్లు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని